ఏపీ ప్రజలపై కొత్త వ్యాట్ (విజయవాడ అడిషనల్ టాక్స్) పడబోతోందా? అవుననే అనిపిస్తోందంటున్నారు సోషల్ మీడియా జనాలు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటివరకు ఏపీకి చెందిన 13 జిల్లాల ప్రజలు తమ పనుల కోసం హైదరాబాద్ కు వచ్చేవారు. సచివాలయానికి వచ్చి ఫైళ్లను నడిపించుకునేవాళ్లు. ఇందు కోసం పదో పరకో సమర్పించుకునేవారు. కానీ ఇప్పడు సచివాలయం విజయవాడకు మారింది. దాంతో 13 జిల్లాల ప్రజలు కొంత వరకు సంతోషించారు. దూరాభారం తగ్గుతుందని సంబరపడ్డారు.
కానీ సరిగ్గా ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది... ఫైలు కదలడానికి వ్యాట్ (విజయవాడ అడిషనల్ టాక్స్) పడుతుందేమోనని కంగారు పడుతున్నారు. సచివాలయంలో ఉండే కొందరు ఉద్యోగులు ఫైలు కదలాలంటే విజయవాడలో తాము ఉండటానికయ్యే ఖర్చును కూడా ఫైలుపై వేస్తున్నారట. ఈ కొత్త వ్యాట్ నుంచి ఏపీ ప్రజలను రక్షించేదెలా? వారుండే నివాస, భోజన, కాఫీ వగైరా ఖర్చులన్నీ పైలుపై వేస్తారేమో తస్మాత్ జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం తెగ చక్కర్లు కొడుతోంది. ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించడం, అక్కడ వాళ్లకు సదుపాయాలు ఏమీ పెద్దగా లేకపోవడంతో నానా బాధలు పడుతున్నారట. అదీ సంగతి.