విజన్ టెక్‌కు నోటీసులు

22 Jul, 2016 03:08 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్: టెలివిజన్ (టీవీ) రిమోట్‌తో కరెంటు మీటర్ల రీడింగ్ నిలిచిపోవడంపై తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) స్పందించింది. టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆగిపోయినట్లు వెల్లడైన విజన్‌టెక్ కంపెనీకి టీఎస్ ఎన్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ నుంచి కొత్త మీటర్ల సరఫరాను ఆపేసింది. ఇప్పటి వరకు విజన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన మీటర్ల బిల్లులను నిలిపివేసింది. వినియోగదారుల ఇళ్లలో అమర్చిన విజన్‌టెక్ కరెంటు మీటర్లన్నింటినీ మార్చాలని ఎన్పీడీసీఎల్ నిర్ణయించింది. ఈ బాధ్యతను విజన్‌టెక్ కంపెనీకే అప్పగించింది.

దీనికయ్యే మొత్తం ఖర్చును విజన్‌టెక్ కంపెనీయే భరించాలని  నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. ‘రిమోట్‌తో ఆగుతున్న రీడింగ్’ శీర్షికతో ఈ నెల 19న ‘సాక్షి’ మెయిన్ పేజీలో వచ్చిన కథనంపై స్పందించిన ఎన్పీడీసీఎల్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఎన్పీడీసీఎల్ కొత్త మీటర్లను కొనుగోలు కోసం ఇటీవల నిర్వహించిన ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లలో పలు కంపెనీలను ఎంపిక చేసింది. 2.90 లక్షల విజన్‌టెక్ కరెంటు మీటర్ల కావాలని కంపెనీకి ఆర్డరు ఇచ్చింది. నైనా పవర్ 1.90 లక్షలు, డెసిబల్ 55 వేలు, జీనస్ 75 వేలు కరెంటు మీటర్లను సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు