కర్నూలు (అగ్రికల్చర్): శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఈనెల 20న జరగనుంది. కర్నూలు డివిజన్ బ్యాలెట్ బాక్సులను పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోనూ, నంద్యాల డివిజన్ బ్యాలెట్ బాక్సులను శాంతిరామ్ ఫార్మసీ కళాశాలలోనూ, ఆదోని డివిజన్ బ్యాలెట్ బాక్సులను సెయింట్ జోషఫ్ ఇంగ్లిషు మీడియా స్కూలులోనూ భద్ర పరిచి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేశారు. శుక్రవారం బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తుతో అనంతపురానికి తరలిస్తారు. ఈనెల 20న అనంతపురంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుంది.