వీఆర్‌ఎస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

1 Feb, 2017 22:00 IST|Sakshi

కడప అర్బన్‌: ఏపీఎస్‌పీ లెవెన్త్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2009లో కంపల్సరీ వీఆర్‌ఎస్‌ పొందిన బండి సాల్మన్‌రాజు (45) బుధవారం రాత్రి రాజారెడ్డివీధిలోని తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప రాజారెడ్డివీధిలో నివసిస్తున్న బండి సాల్మన్‌రాజు 1994 బ్యాచ్‌ (ఏపీఎస్‌పీ లెవెన్త్‌ బెటాలియన్, పీసీ నెంబరు 607)లో కానిస్టేబుల్‌గా చేరాడు. 2002లో రాయచోటికి చెందిన శాంతిప్రియతో వివాహమైంది. వీరికి రెన్ని హర్షిత్‌ (13), రేవంత్‌రాజు (4) పిల్లలు ఉన్నారు.రాజారెడ్డివీధిలోని ఇంటిలో నివసిస్తూ విధులకు హాజరయ్యేవాడు. సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడంతో ఉన్నతాధికారులు అతన్ని సర్వీసు నుంచి తొలగించారు. అయితే తర్వాత భార్య, పిల్లలపై కరుణతో 2009లో కంపల్సరీ వీఆర్‌ఎస్‌ను ఇప్పించారు. అప్పటి నుంచి తన భార్య పిల్లలతో జీవిస్తున్న సాల్మన్‌రాజుకు, భార్య శాంతిప్రియకు మధ్య గత నాలుగు సంవత్సరాల నుంచి మరలా మనస్పర్థలు ఏర్పడ్డాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ఫిర్యాదు చేయలేదని, వారిచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వన్‌టౌన్‌ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు