ఆక్రమిత స్థలాల పరిశీలన..

16 Jul, 2016 20:27 IST|Sakshi

 ప్రొద్దుటూరు: ఆక్రమణలో ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలాలను రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పరిశీలించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వక్ఫ్‌బోర్డు సీఈఓ ఎల్.అబ్దుల్ ఖాదర్, టాస్క్‌ఫోర్సు ఆఫీసర్ అబ్దుల్ ఉద్దూస్, డెరైక్టర్ మేనేజ్ మెంట్ క్లర్క్ ఖాజామొహిద్దీన్, జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ షేక్ మహ్మద్‌షఫివుల్లా, జూనియర్ అసిస్టెంట్ గౌస్ కర్నూలు జిల్లా నుంచి మధ్యాహ్నం ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడంపల్లె మసీదు పరిధిలో అక్రమంగా అమ్మిన స్థలాల గురించి ఆరా తీశారు. అలాగే చౌసేన్‌వలి ఆస్తుల వివరాల గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం డీఎస్పీ నీలం పూజితను కలిశారు. ఈ నెల 11న సాక్షిలో ‘ఆక్రమణలకు అడ్డేది’ శీర్షికన వక్ఫ్‌బోర్డు స్థలాల ఆక్రమణపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి: వరద
 వక్ఫ్‌బోర్డు భూములను, ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం అధికారులను స్వయంగా కలిసి విన్నవించారు. ప్రొద్దుటూరు పరిధిలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన తెలిపారు. పోలీసు కేసులకే పరిమితమైతే ఫలితం ఉండదని, వీటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. అలాగే టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఖాజామొహిద్దీన్ కూడా వక్ఫ్‌బోర్డు ఆస్తుల అన్యాక్రాంతపై అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి కేసుల్లో ఉన్న వారు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి వర్గీయులుగా ఉండటం కొసమెరుపు.

మరిన్ని వార్తలు