జల సంరక్షకులకు అవార్డులు

22 Jul, 2016 01:02 IST|Sakshi
  • బాలవికాస ఆధ్వర్యంలో ప్రదానం
  • కాజీపేట రూరల్‌ : అడుగంటుతున్న భూగర్భ జలాలను పెంచి, రైతులకు అండగా నిలిచేందుకు బాలవికాస సాంఘిక సేవా సంస్థ కృషి చేస్తోందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతీమానగర్‌ బాలవికాస పీపుల్‌ డెవలప్‌ మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో గురువారం జల వికాసం పేరుతో పూడికతీతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షులకు అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు.  రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా చెరువులలో పూడిక తీస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని 13 జిల్లాలతో పాటు కర్ణాటకలో రెండు జిల్లాల్లో మెుత్తం 750 చెరువులలో సుమారు 4.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక మట్టిని తీశామని, 1.15 కోట్ల ఎకరాల్లో భూసారం పెంచామని వివరించారు. ఈ ఏడాది 25 గ్రామాల్లో పూడిక తీత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
    జలవికాస అవార్డులు..
    ఉత్తమ పూడికతీత గ్రామాలకు (జలసంరక్షులు) అవార్డులు అందజేశారు. కర్ణాటకలోని చిక్బుల్లాపూర్‌ జిల్లా గుంటిగానపల్లి గ్రామస్తులకు ప్రథమ బహుమతి, వరంగల్‌ జిల్లా జఫర్‌గడ్‌ మండలం ఉప్పుగల్లుకు రెండవ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆపీసర్‌ తిరుపతి, కో ఆర్డినేటర్లు ప్రసూన్‌రెడ్డి, శ్రీరాం, రాజ్‌కుమార్, కిరణ్, రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు