వానాకాలంలోనూ నీటి గోసే

16 Aug, 2016 21:37 IST|Sakshi
తాగునీటి కోసం సర్పంచ్‌ను నిలదీస్తున్న గ్రామస్తులు
  • నిత్యం నీటి కోసం పాట్లు
  • ఆందోళనకు దిగిన బూర్గుపల్లి వాసులు
  • పాలకులు పట్టించుకోవడంలేదని మండిపాటు
  • సర్పంచ్‌ను నిలదీస్తే రాజీనామా చేస్తానని వెల్లడి
  • మెదక్‌ రూరల్‌: తాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు రోడ్డెక్కారు. ఆర్నెల్లుగా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదని వారు మండిపడ్డారు. మంగళవారం మండలంలోని బూర్గుపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద స్థానికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోఆరు నెలలుగా తాగునీటి సమస్య నెలకొందని, వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నీటి సమస్య తీరడం లేదన్నారు.

    ఇప్పటికీ గ్రామంలో మూడురోజులకోసారి ట్యాంకర్‌ వస్తుండటంతో అవసరాలకు సరిపడా నీళ్లు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ట్యాంకర్లు కూడా సకాలంలో రాకపోవడంతో వాటికోసం కూలీ పనులు వదులుకొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గ్రామంలో 15 వరకు బోర్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటికీ మోటార్లు బిగించి మరమ్మతులు చేయిస్తే నీటి సమస్య తీరుతుందన్నారు.

    నీటి సమస్యను సర్పంచ్‌ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా బోర్లను మరమ్మతులు చేయించకుండా కొందరు క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులు తమ స్వలాభం కోసం సొంత ట్యాంకర్లను పెట్టి నీటిని సరఫరా చేయిస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్‌ దేవమ్మ వృద్ధురాలు కావడంతో సర్పంచ్‌ బాధ్యతలన్నీ ఆమె కొడుకు చూస్తుంటారు. కాగా ఆయన  గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉండక పోవడంతో సమస్యలు ఎక్కడికక్కడా పేరుకు పోయాయని మండిపడ్డారు.

    గ్రామ పంచాయతికి ప్రభుత్వం  మంజూరు చేస్తున్న నిధుల జాడేలేదని, ఇప్పటి వరకు గ్రామంలో ఏ ఒక్క అభివృద్ధి పనిచేసిన దాఖలాలు లేవని ఆరోపించారు. నీటి సమస్య తీర్చాలని తాము సర్పంచ్‌ దేవమ్మను నిలదీస్తే ఆమె రాజీనామా చేస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని గ్రామస్తులు మండిపడ్డారు. కాగా ప్రభుత్వం నుంచి గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌చేశారు. 

    గ్రామంలో పారిశుద్ధ్యం పూర్తిక పడకేసిందని, మురికి కాల్వలు చెత్తా చెదారంతో పూడుకుపోయాయని, వీధుల్లో చెత్తా చెదారం నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధిలైట్లు లేక రాత్రివేళ ఇంటి బయటకు రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. మరోవైపు మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి గ్రామంలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు.

    కాగా ఈ సమస్యలపై తాము సర్పంచ్‌ దేవమ్మను నిలదీస్తే రాజీనామా చేస్తానని చెబుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరి సైతం సమస్యలను పట్టించుకోవడం లేదు. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా సర్పంచ్‌కు చెప్పుకోమంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.

    కూలీ పనులకు వెళ్లలేక..
    గ్రామంలో తాగునీటిని సరఫరా చేయక పోవడంతో కూలీ పనులు కూడా చేసుకోలేని దుస్థితి నెలకొంది. మా సమస్యలను సర్పంచ్‌తోపాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. బోరుబావుల్లో నీటి మట్టం పెరిగినప్పటికీ వాటిని మరమ్మతులు చేయించకుండా ట్యాంకర్లతో నీటి సరఫరా చేయిస్తున్నారు. పనులు వదులుకొని ట్యాంకర్‌కోసం పడిగాపులు పడితేనే నీళ్లు దొరుకుతున్నాయి. లేకుంటే గుక్కెడు నీళ్లకోసం అవస్థలు తప్పడం లేదు. - మౌనిక, గ్రామస్తురాలు.బూర్గుపల్లి

    గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదు
    ఎన్నికలప్పుడే రాజకీయ నాయకులు అభివృద్ధిపై హామీలు గుప్పిస్తారు. ఓట్లేశాక..గద్దెనెక్కి అన్ని మర్చిపోతారు. నిత్యం వారి చుట్టూ తిరిగినా ఏ సమస్య పట్టించుకోరు. సర్పంచ్‌ వృద్ధురాలు కావడంతో ఆమె ఏం చేయలేని పరిస్థితి. ఆమె కొడుకు ఎప్పుడు అందుబాటులో ఉండడు. సమస్యలు పట్టించుకోడు. రాజులేని రాజ్యంలా మా ఊరి పరిస్థితి దాపురించింది. - లెంక కిష్టయ్య, గ్రామస్తులు.

మరిన్ని వార్తలు