–జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్
కర్నూలు(అగ్రికల్చర్): పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ పాయింట్లలో డీలర్లకు సరుకులు విధిగా కాటా వేసి ఇవ్వాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా స్టాక్ పాయింట్ ఇన్చార్జీలకు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ జయకుమార్ తెలిపారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడుతూ... తాను ఇటీవలనే జిల్లా మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నానన్నారు. వచ్చిన వెంటనే డీలర్లకు సరుకులను తూకం వేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో 2,423 చౌక ధరల దుకాణాలు ఉండగా ఏప్రిల్ నెలకు సంబందించి 90 శాతం షాపులకు సరుకులు చేర్చినట్లు తెలిపారు. మిగిలిన షాపులకు 30వ తేదీ సాయంత్రానికి చేరుతాయన్నారు. చక్కెర కొంత ఆలస్యమైనా.. అన్ని కార్డులకు విడుదల అయిందని వివరించారు. చౌకదుకానికి సరుకులు చేరినట్లు డీలర్లు..ఈ–పాస్ మిషన్పై వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు.