జిల్లాల పునర్విభజనను స్వాగతిస్తున్నాం

16 Sep, 2016 00:40 IST|Sakshi
తిమ్మాపూర్‌ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీఎన్జీవో కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్‌ తెలిపారు. ఎల్‌ఎండీ కాలనీలో అమరవీరుల స్థూపం వద్ద వారితోపాటు ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం పోరాటం చేసిన టీఎన్జీవోలకు ప్రత్యేకత ఉందని, ఉద్యోగులు ప్రజలకు చేరువై మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాల ఏర్పాటుకు ముందే ఉద్యోగుల హెల్త్‌కార్డులు, బకాయిలు, ప్రభుత్వ హామీలను, సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 74 ప్రకారం అన్నీ రాయితీలు వర్తిస్తున్నాయని తెలిపారు. కొత్త జిల్లాలతోపాటు కొత్త ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జోనల్‌ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా చేయాలన్నారు. ఉద్యోగుల అభిప్రాయం మేరకు, సీనియార్టీ నష్టం కాకుండా కొత్త జిల్లాలకు పంపాలని కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన వారికి 20శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు జోనల్‌ వ్యవస్థ రద్దు కాలేదని స్పష్టం చేశారు. కొత్త రూల్స్‌ తేవాల్సిన అసరముందన్నారు. పీఆర్సీ బకాయిలు రిటైర్డు ఉద్యోగులకు ముందుగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు సుద్దాల రాజయ్య, మహిళా ఉద్యోగుల అధ్యక్షురాలు రేచల్, ఎల్‌ఎండీ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రమేష్, పోలు కిషన్, టింగో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, అమరేందర్‌రెడ్డి, టీఎన్జీవో నాయకులు జి.శ్రీనివాస్, గంగారపు రమేష్, రాగి సత్యనారాయణ, కిషన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొమురయ్య, రాజయ్య పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు