వైఫై జోన్‌గా కలెక్టరేట్‌

1 Apr, 2017 00:16 IST|Sakshi
వైఫై జోన్‌గా కలెక్టరేట్‌
 ఏలూరు (మెట్రో) : జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణాన్ని వైఫై జోన్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్‌ టీవీ కనెక్షన్, టెలిఫోన్‌ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. జిల్లాలో 12,361 ప్రభుత్వ కార్యాలయాలకు తొలిదశగా ఫైబర్‌ గ్రిడ్‌ అనుసంధాన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. రూ.149కే ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ను జిల్లాలో 6,274 ఆఫీసులకు, రూ.299 ఫ్యాకేజీ కింద 5,628 కార్యాలయాలకు, రూ.1,499 ప్యాకేజీ కింద 206, రూ.2499లకు ప్యాకేజీ కింద 253 ప్రభుత్వ ఆఫీసులకు అందించనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం వేగవంతంగా కలుగుతుందన్నారు.  సమావేశంలో ఫైబర్‌ గ్రిడ్‌ ప్రతినిధి సతీష్, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.కోటేశ్వరి, ఐసీడీఎస్‌ ఆర్‌జేడీ విద్యావతి, డీఈవో ఆర్‌ఎస్‌.గంగాభవాని, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.శంకరరావు, డీపీవో కె.సుధాకర్‌ పాల్గొన్నారు. 
నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పల్లెల్లో శనివారం నుంచి నెలరోజులు పాటు పర్యటించనున్నట్టు కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు. కలెక్టరేట్‌లో పంచాయతీ పన్నుల వసూలు, బయోమెట్రిక్‌ హాజరు, శానిటేషన్, డంపింగ్‌ యార్డుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఏడాదిన్నరగా పల్లెల ప్రగతికి నిరంతరం వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించానని క్షేత్రస్థాయిలో ఏం ప్రగతి జరిగిందో, చేపట్టిన సంస్కరణల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయా? లేదా? అని స్వయంగా పరిశీలన చేస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో కచ్చితంగా పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం వేళ టెలికాన్ఫరె న్స్‌ నిర్వహిస్తానని ఏప్రిల్‌ మాసమంతా కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశాలు ఉండబోవని చెప్పారు. గ్రామాల్లో నివాసం ఉండని పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీల ఉద్యోగం ఆ రోజులో సమాప్తమవుతుందన్నారు. ఏలూరు డివిజన్‌ పంచాయతీ  అధికారి సీహెచ్‌ రాజ్యలక్ష్మి పనితీరు పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో డీపీవో కె.సుధాకర్, డివిజనల్‌ పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సూర్యనారాయణ, శ్రీరాములు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు