ప్రజాసమస్యలపై పోరాడుతా..

6 Apr, 2016 04:47 IST|Sakshi
ప్రజాసమస్యలపై పోరాడుతా..

ముదిగొండ: అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యల కోసం పోరాడుతానని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి, మల్లారం, కమలాపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి సీసీ రోడ్ల శంకుస్థాపనకు విచ్చేసిన ఎంపీ పొంగులేటికి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ.. 14వ ఫైనాన్స్ నిధుల నుంచి 41 శాతం ఇస్తున్నామని చెబుతున్న గొప్పలు అవి సామాన్య ప్రజానీకానికి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్‌ల నుంచి 14వ ఫైనాన్స్ నుంచి ఇచ్చే నిధులు ఏమాత్రం కోత విధించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ నిధుల నుంచి ఇస్తారో తెలియదు కానీ, ప్రజల ప్రధాన సమస్య మంచి నీటి సమస్యను వెంటనే తీర్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే  మేలు జరుగుతుందని అనుకున్న తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతోందన్నారు.

 టీఆర్‌ఎస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, దానిని సద్వినియోగం చేసుకొని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వలే కీర్తిని సంపాదించాలని సూచించారు. వైఎస్ చనిపోయి ఆరేళ్లవుతున్నా ఈ రోజు వరకు ప్రజల గుండెల్లో ఆయన నిలిచి ఉన్నారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు