-
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
నెల్లూరు(వేదాయపాళెం): త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మూడు వారాల పాటు నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులకు కుదించడం విచారకరమన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, కొత్తూరు జర్నలిస్టుల కాలనీ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు క్రాస్రోడ్డు, చిల్డ్రన్స్పార్క్ రోడ్డు, ఎన్టీఆర్నగర్ జంక్షన్ల వద్ద అండర్ బ్రిడ్జిలను నిర్మించాలన్నారు. ప్రత్యేక షాదీమంజిల్, వైఎస్సార్నగర్లో వసతుల కల్పన, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, నగరపాలక సంస్థకు హడ్కో అప్పుల భారం సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. రైస్మిల్లులు, పవర్ప్రాజెక్ట్ల కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్లో ఎస్సీ సబ్ప్లాన్, 14వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టబోయే పనులు ఆలస్యం కాకుండా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. శాసనసభ సమావేశాలను కుదించిన నేపథ్యంలో సమయాన్ని బట్టి పలు సమస్యలను వివరిస్తానని తెలిపారు. పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసయాదవ్, కార్పొరేటర్ లేబూరు పరమేశ్వర్రెడ్డి, నాయకులు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి, సలీమ్, డాక్టర్ సత్తార్, తాళ్లూరు సురేష్బాబు, కట్టా రమణయ్య, విద్యార్థి విభాగ నాయకులు శేషు, జయవర్ధన్, సాయి, తదితరులు పాల్గొన్నారు.