ఆస్పరి: వేధింపులకు తాళలేక ఆస్పరికి చెందిన శివమ్మ (32) అనే మహిళ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. బిణిగేరికి చెందిన శివమ్మకు, ఆస్పరికి చెందిన శాంతప్పతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. శివమ్మను భర్త శాంతప్ప, అత్త నారాయణమ్మ సూటిపోటి మాటలతో వేధించేవారు. పొలం పనులు చేయడం రాదని, రెండో పెళ్లి చేసుకుంటానని భర్త శాంతప్ప బెదరిస్తుండటంతో శివమ్మ మానసికంగా కుంగిపోయింది. గురువారం రాత్రి ఇంట్లో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి అపస్మారక స్థితికి చేరుకుంది. బంధువులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందింది. శివమ్మ తండ్రి వెంకటరాముడు ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త, అత్తపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటరమణ తెలిపారు.