నెల రోజుల్లో డయాలసిస్‌ సేవలు

26 Aug, 2016 00:47 IST|Sakshi
నెల రోజుల్లో డయాలసిస్‌ సేవలు
  • నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు
  • ప్రారంభమైన టెండర్ల ప్రకియ 
  • పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో వైద్యసేవలు
  • ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం
  • ఎంజీఎం :  ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లాలోని వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రులలో డయాలసిస్‌ కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నర్సంపేట, మహబూబాబాద్‌. జనగామ, ఏటూరునాగారం ఆస్పత్రుల్లో పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ప్రారంభించనున్నారు. నెల రోజుల్లోనే ఈ నాలుగు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలను ప్రారంభించేలా రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు సైతం పిలిచారు. 
     
    ఎంజీఎం ఆస్పత్రిపై తగ్గనున్న బారం
    వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం నాలుగు జిల్లాల నుంచి కిడ్నీ వ్యాధి బాధితులు డయాలసిస్‌ చేసుకునేందుకు ఎంజీఎం ఆస్పత్రిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో డయాలసిస్‌ సేవలు కొనసాగుతుండగా సుమారు 300 మంది రోగులు రోజూ ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఒక్కోరోగికి నెలకు 8 నుంచి పదిసార్లు డయాలసిస్‌ చేయాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. రోజురోజుకు రోగులు పెరుగుతుండడంతో ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్‌ యూనిట్‌లు సరిపోక పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో త్వరలో ఏర్పాటు చేసే డయాలసిస్‌ కేంద్రాలతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలగడంతో పాటు మెరుగైన సేవలందుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.
     
    ఒక్కో డయాలసిస్‌ కేంద్రానికి రూ.50 లక్షలు ఖర్చు
    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే 34 డయాలసిస్‌ కేంద్రాల్లో భాగంగా జిల్లాలో నాలుగు ఆస్పత్రుల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనుందని  వైద్యవిధాన పరిషత్‌ జిల్లా కోర్డినేటర్‌ ఆకుల సంజీవయ్య తెలిపారు. ఒక్కో ఆస్పత్రిలో నాలుగు యూనిట్‌లను ఏర్పాటు చేసేవిధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో ఏర్పాటు చేసే డయాలసిస్‌ సెంటర్‌కు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని లె లిపారు. జిల్లాలో ప్రస్తుతం వంద పడకలతో మహబూబ్‌బాద్, జనగామ, 50 పడకలతో నర్సంపేట, 30 పడకలతో ఏటూరునాగారం ఆస్పత్రులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలైన నెప్రాలజీ, యురాలజీ వంటి విభాగంలో అందుబాటులోకి రావడం వల్ల పేదలకు మెరుగైన సేవలు అందుతాయని, ముఖ్యంగా ఏటూరునాగారం వంటి ఏజెన్సీ ప్రాంత  ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 
మరిన్ని వార్తలు