ఆమె ఎవరు..?

24 May, 2016 21:04 IST|Sakshi
ఆమె ఎవరు..?

జగ్గంపేట : వయస్సు సుమారు 35 సంవత్సరాలు. ఆమె ఒంటిపై తెలుపురంగు చీరపై ఆకుపచ్చని చుక్కలు, నీలం, ఎరుపు కాషాయ రంగు పువ్వులు, ఆకుపచ్చ జాకెట్టు ఉన్నాయి. కుడికంటిపై రాయితో గట్టిగా మోదినట్టుగా రక్తపు గాయంతో ఓ మహిళ మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా జగ్గం పేట మండలంలోని ఇర్రిపాక సమీపంలో సోమవారం పోలీసులు కనుగొన్నారు.

మర్రిపాక నుంచి ఇర్రిపాకకు వెళ్లే మార్గాన్ని ఆనుకుని సరుగుడు తోటలో బయటపడిన మృతదేహాంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో హత్యచేసి మధ్యాహ్న సమయంలో తీసుకువచ్చి విడిచిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. తల, ముఖం, కుడికన్నుపై గాయాలను బట్టి చూస్తే.. ఎవరో ఆమెను చెరిచి, హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 సంఘటన నుంచి సమాచారం అందుకున్న ఎస్సై అలీఖాన్ అక్కడికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. విషయాన్ని ఇన్‌చార్జి సీఐ, పెద్దాపురం డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. డీఎస్పీ రాజశేఖరరావు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మహిళ మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆరాతీస్తున్నారు. హత్య కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్యకు వివాహేతరం సంబంధం కూడా కారణం ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు