తెగిన అనుబంధం

5 Feb, 2017 00:20 IST|Sakshi
తెగిన అనుబంధం

మృత్యువు వికృతమైంది. అది ఎప్పుడు ఎవరిపై ఎలా విరుచుకుపడుతుందో ఎవరికీ తెలియదు. బంధాలు, అనుబంధాలను తెంపేస్తోంది. అయిన వారిని అనాథలను చేసి రోడ్డున పడేస్తోంది. దేవుని దర్శనార్థం గుడికి బయలుదేరిన తల్లీకొడుకుపై పంజా విసిరిన మృత్యువు వాహన రూపంలో కుమారుడ్ని కబళించింది. కళ్లెదుటే కన్నపేగు రక్తపు మడుగులో గిలగిలాకొట్టుకుంటూ ప్రాణాలొదిలిన తీరు చూసి ‘తల్లి’డిల్లిపోయింది. భాగ్యనగరం నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరిన దంపతులపైనా కన్నెర్రజేసింది. మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనే లోగానే మరో కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు భార్యను కాటికి పంపింది. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు ఆయా కుటుంబాలలో చీకట్లు నింపాయి.

తాడిపత్రి రూరల్‌ : తాడిపత్రి మండలం బందార్లపల్లి సమీపంలో శనివారం రాత్రి రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన సావిత్రి(52) మృతి చెందారు. ఆమె భర్త శ్రీనివాసరెడ్డి (57) తీవ్రంగా గాయపడ్డారని తాడిపత్రి రూరల్‌ ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు... దంపతులిద్దరూ హైదారాబాద్‌ నుంచి కారులో స్వగ్రామమైన నాగిరెడ్డిపల్లికి బయలుదేరారు.  మార్గమధ్యంలోని బందార్లపల్లి సమీపానికి తాడిపత్రి నుంచి గుత్తికి వెళ్తూ ఎదురొచ్చిన మరో  కారు ఢీకొనడంతో సావిత్రి అక్కడిక్కడే మరణించారు. శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడి స్పహ కోల్పోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ తమ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. వెంటనే బాధితుడ్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి, సావిత్రి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు