బాలింతను కాటేసిన విద్యుదాఘాతం

7 Apr, 2017 23:55 IST|Sakshi

చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామంలో విద్యుదాఘాతానికి కళావతి(23) మృతి చెందినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల బాలింత. గ్రామానికి చెందిన కళావతి, ఈశ్వర్‌ దంపతులు మగ్గం నేస్తూ జీవనం సాగించే వారు. కళావతి శుక్రవారం ఉదయం తడి దుస్తులను ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న ఇనుప తీగపై ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు వివరించారు. భర్త, ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే ఆమెను చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పరామర్శించేందుకు వస్తూ...
కళావతి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలియగానే న్యామద్దల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి, మృతురాలి భర్తను ఓదార్చారు. వారిలో జయకృష్ణ అనే గ్రామస్తుడు కూడా ఉన్నాడు. అతను పరామర్శ అనంతరం స్వగ్రామానికి బైక్‌లో వెళ్లూ మార్గమధ్యంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అదే పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. 

మరిన్ని వార్తలు