ఆడపిల్లలు పుట్టారని ఆత్మహత్య

2 May, 2016 11:11 IST|Sakshi

కర్నూలు: తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని మనస్తానికిగురైన శ్రీదేవి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండ్లెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

కుటుంబసభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల మేరకు...ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన శ్రీదేవికి మండ్లెం గ్రామానికి చెందిన శ్రీనివాసులుతో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన 11 ఏళ్ల వరకు పిల్లలు కాకపోవటంతో నిత్యం ఆమె మదనపడిపోయేది. అయితే ఐదేళ్ల క్రితం సుమలత అనే ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. తరువాత నాలుగు నెలల క్రితం ఆమె మరో ఆడబిడ్డ పుట్టింది. ఇద్దరూ ఆడపిల్లలు కావటంతో ఆమె మనస్తాపంతో తాను చనిపోతానని, తనకు మనసు బాగోలేదని తీవ్ర మనోవేదన కు గురయ్యేదని భర్త శ్రీనివాసులు తెలిపారు. దీనికితోడు నెలరోజుల క్రితం ఆమె తల్లి మృతి చెందటంతో మరింత మనోవేదన గురయ్యేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారిన తర్వాత ఐదు గంటల ప్రాంతంలో మిద్దెపై నుంచి కిందికి వచ్చి.. బాత్‌రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పుపెట్టుకుంది. మంటలు రావటంతో మిద్దెపై నిద్రిస్తున్న శ్రీనివాసులు ఇంట్లోకి వచ్చి చూశాడు. మంటల్లో కాలిపోతున్న భార్యను కాపాడుకునేందుకు గట్టిగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవాళ్లు వచ్చారు. మంటలు అర్పగా..అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయిన శ్రీదేవి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న నందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై టి.సుబ్రమణ్యం సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతురాలి అన్న బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు