బాబుపై మహిళల తిరుగుబావుటా తథ్యం

16 Jul, 2016 18:21 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ

మడకశిర: రాష్ట్రంలోని మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు చేయడం తథ్యమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా డాక్టర్ తిప్పేస్వామి నర్సింగ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఇంత వరకు పైసా కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదన్నారు. తప్పుడు హామీతో మహిళల ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం డ్వాక్రా మహిళలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా  ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలు కన్నెర్ర చేస్తే చంద్రబాబుకు పుట్టగతులుండవని హెచ్చరించారు. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.  

రాష్ర్ట వ్యాప్తంగా గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఎస్‌ఆర్ అంజినరెడ్డి, మండల కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప, పట్టణ నాయకులు పార్వతమ్మదాసన్న, హిద్దు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు