మహిళపై అత్యాచారం ఆపై...

7 Jul, 2016 20:57 IST|Sakshi
మహిళపై అత్యాచారం ఆపై...

మహబూబ్ నగర్ జిల్లా : ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డుకు సమీపంలోనే ఓ గుర్తు తెలియని మహిళను అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన వంగూరు మండలం చారకొండ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చారకొండ సమీపంలో బుధవారం ఉదయం గుండె యాద య్య గౌడ్ వ్యవసాయ పొలంలో కాలిపోయి గుర్తుపట్టనట్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించిన చుట్టు పక్కల రైతులు వెంటనే డిప్యూటీ సర్పంచ్, పొలం యజమానికి సమాచారం ఇచ్చారు.
 
 వెంటనే వారు అక్కడికి చేరుకుని, విషయం పోలీసులకు చేరవేశారు. కల్వకుర్తి సీఐ వెంకట్, వంగూరు, వెల్దండ ఎస్‌ఐలు నరేష్, జానకిరాంరెడ్డి, వంగూరు ట్రైనీ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్  వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, పంచనామా నిర్వహించారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు జిల్లాకేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు.
 
 అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి దుండగులు మహిళను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి, మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకట్ తెలిపారు. మృతురాలి చేతిమీద రాజప్ప అని రాసి ఉందని, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను తెలుసుకుని మృతురాలి ఆచూకీ తెలుసుకుంటామని, ఆతర్వాత ఇందుకు బాధ్యులైన వారిని గుర్తిస్తామన్నారు. ఈ సంఘటనతో చారుకొండ ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.  
 

మరిన్ని వార్తలు