ఎట్టకేలకు పనులు ప్రారంభం

26 Jul, 2016 00:11 IST|Sakshi
  • సాక్షి’ కథనాలకు కదిలిన యంత్రాంగం
  • అంత్యపుష్కరాలకు సిద్ధమవుతున్న ఘాట్లు 
  • ఏర్పాట్లు చేస్తున్న వివిధ శాఖలు 
  • సమయం ఇంకా ఐదు రోజులే
  • సాక్షి, రాజమహేంద్రవరం :ఇంకా ఐదు రోజులే గడువు ఉన్న (జులై 31నుంచి) అంత్యపుష్కరాలకు ఆలస్యంగా ... హడావుడిగా రాజమహేంద్రవరం నగరంలో ఉన్న ఘాట్లలో సోమవారం నుంచి ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు రోజుకు సుమారు 1.5 లక్షల మంది వస్తారని అంచా వేస్తున్న నేపథ్యంలో ఇంకా ముందుగానే పనులు చేపట్టాల్సిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన విషయం పాఠకులకు విదితమే. ‘ప్రతి రేవూ సమస్యల నెలవు’ శీర్షికతో ఈ నెల 24న, ‘భక్తులకు బస ఎక్కడో శీర్షికతో ఈ నెల 25న ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది.

    పుష్కరానికి గడువు దగ్గరపడుతున్నా పట్టించుకోని పాలకులను, అధికారులను తట్టిలేపింది. దీంతో సోమవారం నుంచి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పుష్కరఘాట్, గౌతమీ ఘాట్లకు వెళ్లే రహదారిపై బారీకేడ్లు ఏర్పాటును రోడ్లు, భవనాల శాఖ చేపట్టింది. గోదావరి వరదల కారణంగా ఘాట్లలో పేరుకుపోయిన మట్టి, వ్యర్ధాలను  నగరపాలక సిబ్బంది తొలగిస్తున్నారు. కోటిలింగాల ఘాట్‌ వద్ద గట్టుపై ధ్వంసమైన నాపరాళ్లను తిరిగి అమర్చుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, ప్రతి ఘాట్‌లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్లలో ఎలాంటి అవాంbè నీయ సంఘటనలు జరగకుండా నగరపాలక సంస్థ 40 సీసీ కెమెరాలను అమర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో ఉన్న ఘాట్లను నాలుగు జోన్‌లుగా విభజించి అక్కడ అవసరమైన మేరకు సీసీ కెమారాలను అమర్చనున్నారు.

    ఘాట్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందు నగరపాలక సంస్థ కార్యాలయం, పోలీసు అతిథి గృహం వద్ద పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల్లో సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఆయా ఎన్‌జీవో సంస్థలు చేపట్టాల్సిన సేవలపై కమిషనర్‌ వి.విజయరామరాజు సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ అధికారులు నగరంలోని ఘాట్లను పరిశీలించారు. మెడికల్‌ కౌంటర్, సమాచార కేంద్రాన్ని ఘాట్లలో ఎక్కడెక్కడ పెట్టాలో పరిశీలించారు.
     
     
మరిన్ని వార్తలు