నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి

26 Sep, 2016 22:40 IST|Sakshi
అధికారులతో సమీక్షిస్తున్న సీఎస్‌ రాజీవ్‌శర్మ
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ
  • ముకరంపుర : ప్రాజెక్టుల పనుల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన దృష్ట్యా సోమవారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో కలెక్టర్, ఇరిగేషన్, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్లతో ముందస్తుగా సమీక్షించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మిడ్‌మానేరుకు ఎడమవైపు గండిపడి బండ్‌ తెగిపోయిన దృష్ట్యా జరిగిన నష్టం, మిడ్‌మానేరు డ్యాంకింద ముంపు గ్రామాల ప్రజల తరలింపు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై సమీక్షించారు. డ్యాంనిర్మాణం సకాలంలో ఆయా ఏజెన్సీలు నిర్మాణాలు పూర్తిచేయకపోవడంతో నష్టం జరిగిందని, సకాలంలో ఎందుకు పూర్తిచేయలేదని, ఆ ఏజెన్సీపై తీసుకున్న చర్యలను సీఈ అనిల్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నారు. ముంపుగ్రామాల ప్రజలకు పరిహారం, పునరావాసంవంటి అంశాలపై స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలపై సీఈ వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేకాధికారి బీఆర్‌.మీనా, కలెక్టర్‌ నీతూ ప్రసాద్, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ దేవసేన పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు