యానాం యువకుడికి సివిల్స్‌లో 410వ ర్యాంకు

31 May, 2017 23:45 IST|Sakshi
  •  
  • ఉదయ్‌శ్రీరామ్‌వినయ్‌ కు అభినందనలు వెల్లువ
  • యానాం:
     యానాంకు చెందిన యువకుడు మల్లిపూడి ఉదయ్‌శ్రీరామ్‌ వినయ్‌ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ (యూపీఎస్‌సీ)లో 410వ ర్యాంకు సాధించారు. యానాం నుంచి సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన మొట్టమొదటి వ్యక్తిగా వినయ్‌ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా గురువారం సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాలు విడుదల కావడంతో వినయ్‌కు ర్యాంకు రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా  వినయ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను ప్రాథమిక తరగతి నుంచి ఇంటర్‌ వరకు రీజెన్సీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివానని అనంతరం పుదుచ్చేరి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా సంవత్సరంపాటు ఉద్యోగం చేశానని తెలిపారు. అయితే ప్రజలకు సేవలందించేందుకు సివిల్‌ సర్వీసెస్‌ ఒక మార్గమని కొంతమంది ఐఏఎస్‌ల ద్వారా స్ఫూర్తి పొందానని, ఈ నేపథ్యంలో ఐఏఎస్‌కు వెళ్లాలనే బలమైన లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నానని తెలిపారు. మొదటి ప్రయత్నంలో సివిల్స్‌ ర్యాంకు రాలేదనే దిగులుచెందకుండా రెండో ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో శిక్షణ తీసుకున్నానని, విజయం సాధించానని తెలిపారు. ఈ ర్యాంకును ప్రకారం ఐఏఎస్‌ లేదా ఐఆర్‌ఎస్‌ కేటాయించే అవకాశం ఉందన్నారు. వినయ్‌ తండ్రి మల్లిపూడి రంగారావు కోలంక హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వినయ్‌ సివిల్స్‌లో ర్యాంకు సాధించడం పట్ల పుదుచ్చేరి ఆరోగ్యశాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు, ఏపీ డిప్యూటి సీఎం చినరాజప్ప ఫోన్లో వినయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
    .
    సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా ప్రజా సేవచేయాలనే తలంపు ఉండడంతో ఆ దిశగా ప్రోత్సహించాను. వినయ్‌కూడా కష్టపడి 410వ ర్యాంకు సాధించాడు. సంతోషంగా ఉంది. ––తండ్రి మల్లిపూడి రంగారావు
    ప్రాథమిక విద్యనుంచి మెరుగైన రీతిలో రాణించేవాడు. కష్టపడి చదివేతత్వం ఉంది. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేరాడు.  పబ్లిక్‌సర్వీస్‌ మీద మక్కువతో సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు
     తల్లి విజయకుమారి. 
మరిన్ని వార్తలు