లావేరు : యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ యోగా గురువు పి.లక్ష్మణరావు అన్నారు. మండల కేంద్రం లావేరులోని వస్త్రపురి కాలనీలో ధ్యాన కేంద్రంలో ఆదివారం ఉచిత యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిళ్లకు గురవుతున్నారని చెప్పారు. యోగా చేస్తే ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని చెప్పారు. అనంతరం వివిధ రకాల యోగాసనాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ధ్యాన కేంద్రం కోఆర్డినేటర్ కోరాడ వాసుదేవరావు, లావేరు పీఏసీఎస్ అధ్యక్షుడు మీసాల అప్పారావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లంకలపల్లి నారాయణరావు, మాజీ వైస్ ఎంపీపీ మహదాసు రాంబాబు పాల్గొన్నారు.