భువనగిరి అర్బన్
ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని తుక్కపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన ఈర్ల ధర్మయ్య, పెంటమ్మల మొదటి కుమార్తె విజయ(27) భువనగిరిలో బీఈడీ వరకు చదువుకుంది. అనంతరం ఇంటి వద్ద ఉంటోంది. కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య కారణాలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతురాలి తల్లి పెంటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఏఎస్ఐ రాజేశ్వర్ తెలిపారు.