ప్రేయసి బాటలోనే ప్రియుడు..

16 Jun, 2017 11:39 IST|Sakshi

నాదెండ్ల(చిలకలూరిపేట): ప్రేమించిన యువతి ఆత్మహత్యకు పాల్పడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు తానూ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్లలో చోటు చేసుకుంది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నిండింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన నబీ సాహెబ్‌ (24) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశాడు. అదే మండలం చందవరం గ్రామానికి చెందిన బీటెక్‌ పూర్తయిన యువతి శ్రావణి, సాహెబ్‌ ప్రేమించుకున్నారు. విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించలేదు. పైగా శ్రావణికి వేరే యువకుడితో వివాహం జరిపించేందుకు ఆమె తల్లిదండ్రులు గత నెల 29న నిశ్చితార్ధం పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో గత నెల 24న శ్రావణి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ విషయం తెలిసి నబీ సాహెబ్‌ కూడా అదే రోజు పురుగుమందు తాగాడు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శ్రావణి ఈ నెల 1న చనిపోయింది. అప్పటి నుంచి గుంటూరు జీజీహెచ్‌లోనే చికిత్స పొందుతున్న నబీసాహెబ్‌ గురువారం ఉదయం కన్నుమూశాడు. పెద్దల పంతాలతో ప్రేయసీప్రియుల ఇరువురి జీవితాలు ఇలా విషాదాంతంగా ముగిశాయి. రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.

మరిన్ని వార్తలు