లారీ ఢీకొని యువకుడు మృతి

13 Mar, 2017 23:29 IST|Sakshi
లారీ ఢీకొని యువకుడు మృతి
మరో యువకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం 
సొమ్మసిల్లిన తల్లి
బంధువుల ఆర్తనాదాలు
గండేపల్లి (జగ్గంపేట) : కుటుంబ పెద్ద దూరమైనప్పటికీ పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతోన్న ఆమెకు విధి కడుపు కోతకు గురి చేసింది. చేతికి అందివచ్చి, పెళ్లీడుకొచ్చిన కొడుకు పాడెక్కుతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోయింది. లారీ రూపంలో మృత్యువు కన్నబిడ్డను కడతేర్చిందని తెలుసుకున్న ఆమె కొడుకు మృతదేహాన్ని చూసుకుని గుండెలు అలిసేలా ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. మండలంలోని మల్లేపల్లికి చెందిన మందపల్లి ఎలీషారాణి, సుందర్రావు దంపతులకు వీరబాబు, ప్రసన్‌కుమార్‌ (20), అభినయ పిల్లలున్నారు. వీరి పిన్నవయసులోనే తండ్రి మృతి చెందడంతో తల్లి కూలి పనులు చేస్తూ వీరిని పెద్దచేసింది. ప్రసన్నకుమార్‌ తాపీ పనులకు వెళుతూ కుటుంబానికి అండగా నిలిచాడు. వీరబాబు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాజమహేంద్రవరం వైపు నుంచి మోటార్‌ సైకిల్‌పై అతడు ఇంటికి వస్తుండగా గ్రామ శివారు బంకు ఎదురుగా వెనుకనే వస్తున్న లారీ ఢీకొని పైనుంచి వెళ్లిపోయింది. అక్కడికక్కడే ప్రసన్‌కుమార్‌ మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చున్న రవికుమార్‌కు ప్రమాదం త్రుటిలో తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రజనీకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
మరిన్ని వార్తలు