అడవిదేవులపల్లి (దామరచర్ల) : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గ్రామంలో అఖిలపక్షాలు చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మండల కేంద్రం చేయక పోవడంతో మనస్తాపానికి గురైన దేవతల సైదయ్య(25) అనే యువకుడు దీక్షవద్ద పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే చికిత్స కోసం గ్రామంలో ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం దీక్ష సభా స్థలం వద్ద జూలకంటి మాట్లాడారు. అన్ని అర్హతలున్న అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయక పోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రం కోసం చేస్తున్న ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే మండల కేంద్రం సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేశ్, జగదీశ్వర్రెడ్డి,చంద్రశేఖర్యాదవ్,పాపానాయక్,వినోద్,సైదులు, మద్దెలశ్రవన్,బండి నాగేశ్వరావు,మున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.