వెంకటాపురం : వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కమ్మరిగూడెంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాకాల స్వప్న(20) కొన్ని రోజులుగా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన గ్రామస్తులు స్వప్నను 108 వాహనంలో వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై బండారి కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.