►అసభ్యకరంగా ప్రవర్తించారంటూ దేహశుద్ధి చేసిన మహిళలు
►అర్థరాత్రి ఘటనపై కేసు నమోదు
విశాఖపట్నం : నగరం నడిబొడ్డున ఉన్న చిత్రాలయ మల్టీప్లెక్స్లో సెకండ్ షో సినిమాకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అత్యధిక భద్రత ఉండే హై క్లాస్ మల్టీప్లెక్స్లో ఆడవాళ్ల బాత్ రూమ్లో కొందరు మధ్యప్రదేశ్ యువకులు దూరడం తీవ్ర దుమారం రేపుతోంది. కొందరు మహిళలు కూడా ఆ కుటుంబంతో పాటు బాధితులైనప్పటికీ పరువు కోసం ఆలోచించి వారెవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సంఘటన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులపై గురువారం కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ జంట నగరంలో దుస్తుల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి సెకండ్ షో సినిమా చూసేందుకు చిత్రాలయ మల్టీప్లెక్స్కు వెళ్లారు.
సినిమా పూర్తయిన తర్వాత ఆ జంటలోని మహిళ బాత్రూమ్కు వెళ్లింది. అయితే అప్పటికే లేడీస్ బాత్రూమ్లో ముగ్గురు యువకులు ఉన్నారు. వారిని గమనించిన యువతి భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తుకుని వచ్చేసింది. ఆమెతో పాటే బాత్రూమ్లోకి వెళ్లిన మరికొంతమంది మహిళలు కూడా పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగు తీశారు. విషయం తెలుసుకున్న మిగతావారు ఆ యువకులను పట్టుకున్నారు. ఆడవాళ్ల బాత్రూమ్లోకి వెళ్లిన ముగ్గురు యువకులతో పాటు, బాత్రూమ్ బయట ఉన్న వారి సంబంధీకులు మరో ముగ్గురికి దేహశుద్ధి చేశారు.
ముగ్గురిపై కేసు : పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్నారు. అయితే స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగితే పరువు పోతుందని మహిళలు అనడంతో వారిచ్చిన వివరాల మేరకు మహరాణిపేట పోలీస్ స్టేషన్ సీఐ వెంకట నారాయణ కేసు నమోదు చేశారు. నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన అబ్దుల్లా, దినేష్, మహ్మద్ అన్వర్లుగా గుర్తించామని, వారు నగర వీధుల్లో దుస్తులు విక్రయిస్తుంటారని సీఐ తెలిపారు. కాగా మహిళల బాత్రూమ్లో దూరి వారిని అసభ్యకరంగా సెల్ఫోన్లో చిత్రీకరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాటిని సీఐ కొట్టిపడేస్తున్నారు. అలాంటివేమీ జరగలేదని, ఆ యువకులు తెలియక లేడీస్ బాత్రూమ్కి వెళ్లారని ఆయన అంటున్నారు.