జీడిపల్లి రిజర్వాయర్ లో యువకుడి గల్లంతు

24 Aug, 2016 23:39 IST|Sakshi
జీడిపల్లి రిజర్వాయర్ లో యువకుడి గల్లంతు

బెళుగుప్ప : మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు పుష్కర స్నానానికి  వచ్చిన ప్రదీప్‌ (18) అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనంతపురం నగరంలోని నాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న  ప్రదీప్‌ తన మిత్రులు, సమీప బంధువులతో కలిసి ఆటోలో  పుష్కర స్నానానికి జీడిపల్లి రిజర్వాయర్‌కు మంగళవారం వచ్చాడు. లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో  మునిగిపోయాడు.


ఇది గమనించిన స్నేహితులు గాలించినా ఫలితం లేక పోయింది. విషయాన్ని ప్రదీప్‌ తల్లి కృష్ణమ్మకు తెలిపారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెళుగుప్ప ఇన్‌చార్జ్‌ డీఎస్‌పీ చలపతిరావు, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ శంకర్‌రెడ్డి, ఏఎస్‌ఐ విజయనాయక్‌ రిజర్వాయర్‌ వద్దకు బుధవారం వెళ్లి ఆరా తీశారు.  గజ ఈతగాళ్లతో గల్లంతైన ప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టారు. అయినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రదీప్‌ తండ్రి మునెప్ప మృతి చెందగా, తల్లి తమ్ముడితో  కలసి ఉంటున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా ఉండేవాడని యువకుడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. 

మరిన్ని వార్తలు