బావిలో పడి యువకుడు మృతి

24 Apr, 2017 00:35 IST|Sakshi
బావిలో పడి యువకుడు మృతి
కృష్ణగిరి : నీరు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందిన సంఘటన  పందిర్లపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ హరినాథ్‌సింగ్‌ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కమ్మరి రామచంద్ర, లక్ష్మినరసమ్మ దంపతుల పెద్ద కుమారుడైన హర్షవర్ధన్‌(20) రోజు మాదిరిగానే పొలం పనులకు వెళ్లాడు. దాహం వేయడంతో సమీపంలోని బావిలో నీరు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో జారిపడ్డాడు. అయితే హర్షవర్దన్‌కు ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పొలాల్లో గాలించక బావిలో మృతదేహం కనిపించింది. కుమారుడి అకాల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండి రామచంద్ర ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
 
మరిన్ని వార్తలు