అదృశ్యానికి అక్రమ సంబంధమే కారణమా !!

31 May, 2016 09:08 IST|Sakshi
అదృశ్యానికి అక్రమ సంబంధమే కారణమా !!

మిస్టరీగా యువకుడి అదృశ్యం కేసు
వారం రోజులుగా కనిపించిన పరిస్థితి
వివాహేతర సంబంధంపై అనుమానాలు
అర్బన్ పీసీలో మిస్సింగ్ కేసు నమోదు

 
రాజంపేట: రాజంపేట పట్టణంలో గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) అదృశ్యం మిస్టరీగా మారింది. వారంరోజులుగా కనిపించని పరిస్థితి నేపథ్యంలో రాజంపేట అర్బన్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. మండలంలోని పాపరాచపల్లెకు చెందిన సాయిప్రకాశ్‌రాజు తన తల్లితండ్రులతో కలిసి పట్టణంలోని విద్యుతనగర్‌లో ఉంటున్నారు. ఇతని అదృశ్యం వెనుక వివాహేతర సంబంధంపై అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. సాయి స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

గత శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన సాయి వారంరోజులుగా రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే తన బిడ్డ అదృశ్యమైయ్యాడని తండ్రి చంద్రరాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. ఆ యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలో సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఓ వివాహితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అప్పుడప్పుడు ఆమెతో గొడవపడి కొట్టేవాడ నే వాదనలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఈమె భర్త జీవోనపాధికై గల్ఫ్‌దేశానికి వెళ్లాడని సమాచారం.

మరొకరితో వివాహేతర సంబంధం కారణమనే...

సాయిప్రకాశ్‌రాజు సంబంధం పెట్టుకున్న మహిళ కడపకు చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణమే వీరిద్దరికి మధ్య గొడవలు మొదలైనట్లు పలువురు చెప్పుకుంటున్నారు.  ఈ యువకుడు ఆమె ఇంటిలోకి వెళ్లగానే అక్కడ కడపకు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు, తర్వాత వారి మధ్య ఘర్షణ వాతవరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సాయిపై దాడి చేయగా మృతి చెందినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పోలీసు విచారణలో ఉన్న వివాహిత కూడా ఇదే విధంగా వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు సాయి ఉన్నడా? లేక హత్య చేసిన శవాన్ని మాయం చేశారా? ఎక్కడ బూడ్చారా అన్న అంశాలు పోలీసులకు సవాల్‌గా మారాయి.

మరిన్ని వార్తలు