పరిగి: తనతో నిశ్చితార్థం జరిగిన పెళ్లికూతురు మరో యువకుడితో వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఇబ్రహింపూర్లో పెద్దతండాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ఇబ్రహింపూర్ తండాకు చెందిన హిర్యానాయక్ కుమారుడు నరేష్(20)కి గత నెల మహబూబ్నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం కాస్లాబాద్కు చెందిన యువతితో నెల రోజుల కిందట వివాహం నిశ్చయం కావటంతో పాటు నిశ్చితార్ధం కూడా జరిగింది. కాగా వారం రోజుల కిందట ఆ బాలిక బొంరాస్పేట్ మండలం కొత్తూర్కు చెందిన ఓ యువకుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది.
యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారు సదురు యువకుడిపై కేసు నమోదు చేసి బాలికను తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా మొదట ఆ బాలికతో నిశ్చితార్ధం జరిగిన ఇబ్రహింపూర్ తండాకు చెందిన నరేష్తో పాటు వారి కుటుంభ సభ్యులకు విషయం తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనతో నిశ్చితార్ధం జరిగిన అమ్మాయి వేరే యువకునితో వెళ్లిపోవటం జీర్ణించుకోలేకపోయాడు. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయంలో పరుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.