విజయవాడ: కృష్ణాజిల్లాలో పుష్కరాల్లో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు.
వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చారు. ఎంతో కష్టపడి చదివించామని, చేతికొచ్చిన కుమారుడు ఆదుకుంటాడని అనుకుంటే ఇలా జరిగిందని నగేష్ తల్లిదండ్రులు వైఎస్ జగన్ వద్ద బోరున విలపించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.
అనంతరం నందిగామ పట్టణానికి చెందిన హరిగోపి, లోకేష్, చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన గోపిరెడ్డి, తోటరావులపాడు గ్రామానికి చెందిన హరీష్ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కృష్ణాజిల్లా నందిగామ చైతన్య డిగ్రీ కాలేజీలో బికాం ఫైనల్ ఇయర్ విద్యార్థులు పుష్కర స్నానానికి వెళ్లి నీట మునిగిన ప్రమాదంలో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే.