చేతగాని పాలనకు ఓటేయొద్దు

17 Nov, 2015 01:26 IST|Sakshi
చేతగాని పాలనకు ఓటేయొద్దు

► వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
► ఎందుకు ఈ ఎన్నిక తెచ్చారో కేసీఆర్‌ను నిలదీయండి
► ఒక్కో దళితుడికి మూడెకరాలు ఇస్తామన్న హామీ ఏమైంది?
► రైతు ఆత్మహత్యలపై టీఆర్‌ఎస్ వాళ్లను నిలదీయండి
► వరంగల్‌లో మొదలైన జగన్ ప్రచారం..
► తొర్రూరులో భారీ బహిరంగ సభ

 
 వరంగల్ నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేయడమంటే.. కేసీఆర్ చేస్తున్న ఈ చేతగాని పరిపాలనకు ఓటేయడమే! ఇలాంటి పరిపాలనకు ఓటేస్తే ఆయన మారరు. పైగా బాగా పరిపాలన చేస్తున్నానని అనుకుంటారు. రైతుల మీద ఇంకా పెద్ద పెద్ద బండలు వేసే రోజులొస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ కేసీఆర్‌కు ఓటేయొద్దు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మోజు తీర్చుకోవడం కోసమే వరంగల్ ఉప ఎన్నికలు తెచ్చారని మండిపడ్డారు. నిజంగా ఓటడిగే హక్కు, అధికారం ఏ పార్టీకైనా ఉందంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకేనని ఉద్ఘాటించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావుకు మద్దతుగా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలిరోజు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం నుంచి మొదలైన ప్రచారం వర్ధన్నపేట మీదుగా సాగి తొర్రూరు వద్ద ముగిసింది. తొర్రూరు బస్టాండ్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే...

 ఎన్నికలకు ఇదా కారణమని నిలదీయండి
 కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది. ఆ ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదని నిల దీస్తూ కేసీఆర్ తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే గర్వపడే వాళ్లమని, ఆ కారణంతో ఈ ఉప ఎన్నిక వచ్చి ఉంటే కాలర్ ఎగిరేసే వాళ్లమని టీఆర్‌ఎస్ నేతలకు చెప్పండి. కానీ కేసీఆర్ మోజు తీర్చుకోవడం కోసం ఈ ఎన్నిక వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని చెప్పండి. వరంగల్‌లో ఉప ఎన్నిక వచ్చినా ఫర్వాలేదుగానీ.. తాను కోరుకున్న అభ్యర్థి మంత్రిమండలిలో ఉండాలని కేసీఆర్ మోజు పడ్డారు. వరంగల్ జిల్లాలో తన పార్టీలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నా.. వాళ్లను కాదని, ఆయన మోజుపడిన వ్యక్తి ఎంపీ అయినప్పటికీ ఆయనతో రాజీనామా చేయిం చారు. టీఆర్‌ఎస్ వాళ్లెవరైనా మిమ్మల్ని ఓటడగడానికి వస్తే ఉప ఎన్నికలకు ఇదా కారణం అని గట్టిగా నిలదీయండి.

 ఎస్సీలకు మూడెకరాల భూమి ఎక్కడ ?
 వైఎస్సార్ హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అం దాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు 108, ప్రతి నిరుపేదకు కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, ప్రతి పేద విద్యార్థి పెద్ద చదువులు చదివేందుకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలను అమలు చేసి చూపా రు. ప్రతి అక్కాచెల్లె ఆర్థికంగా ఎదిగేందుకు పావలా వడ్డీ రుణాలకు శ్రీకారం చుట్టారు. దేశం మొత్తం మీద నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు కట్టిస్తే వైఎస్సార్ ఒక్కరే తెలుగు రాష్ట్రా ల్లో 48 లక్షల ఇళ్లు కట్టి చూపించారు. దళితులకు 20.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. కేసీఆర్ మీకు ఎక్కడైనా కనిపిస్తే, టీఆర్‌ఎస్‌వాళ్లు మీ దగ్గరకు వస్తే అడగండి.. ‘అయ్యా..! ఎన్నికలప్పుడు ప్రతి దళితుడికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని చెప్పారు. ఇంత వరకు మీరు ఎన్ని ఎకరాల భూమి దళితులకు పంపిణీ చేశారు’ అని నిలదీయండి. 18 నెలల పరిపాలనలో దళితులకు కనీసం 1,600 ఎకరాలు కూడా ఇవ్వని అధ్వాన పరిస్థితి ఉంది.

 ఓరుగల్లులోనే 150 మంది రైతు ఆత్మహత్యలా?
 అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ఇదే కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పటిదాకా ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారని గట్టిగా నిలదీయండి. ఇప్పటి వరకు ఆయన కట్టించింది కేవలం 396 ఇళ్లు. అవి కూడా ఇవాళ హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం చేశారు. అవి తప్ప రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా కట్టించలేని అధ్వాన పరిపాలన రాష్ట్రంలో సాగుతోంది. ఒక్క ఓరుగల్లు జిల్లాలోనే 150 మంది రైతులు చనిపోయారు. వారి పరిపాలనలో అంతమంది రైతులు ఎందుకు చనిపోయారో ఒక్కసారి అడగండి. పత్తికి కనీస మద్దతు ధర రూ.4,100 ఇస్తున్నామని సీసీఐ చెప్తుంటే.. రైతులకు మాత్రం రూ.3,500 కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో పత్తి అమ్ముకుంటున్నారు. ఆ దివంగత నేత పరిపాలనలో రైతులు క్వింటాల్ పత్తి రూ.6,700కు అమ్ముకున్న రోజులను గుర్తు తెచ్చుకొమ్మని కేసీఆర్‌కు చెప్పండి.

 ఫీజు బకాయిలపై గట్టిగా అడగండి
 ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నడుపుతున్నారు. ఈ పథకానికి ఈ సంవత్సరం సంగతి దేవుడెరుగు. 2014-15 సంవత్సరానికి సంబంధించి రూ.2,452 కోట్లు ఈ పథకానికి అవసరమైతే.. వాటిలో రూ.1,530 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారని కేసీఆర్‌ను గట్టిగా నిలదీయండి. ఈ ఏడాది కాలేజీలు మొదలై 5-6 నెలలు గడిచిపోయింది. పాత బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయి. కేసీఆర్ పరిపాలనను, దివంగత నేత వైఎస్సార్ పాలనను ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా సిన్సియారిటీ లేదు.. ఏ ఒక్కరికి కూడా నిజాయితీ లేదు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండె ల్లో బతికే ఉండాలనే తపన, ఆరాటం ఏ ఒక్కరికి లేదు. ఇలాంటి పాలనకు చరమగీతం పాడండి. కేసీఆర్‌కు ఓటేయడమంటే... ఆ యన చేతగాని పాలనకు ఓటు వేయడమే.

 కాంగ్రెస్.. దిక్కుమాలిన పార్టీ
 కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తే మీకెందుకు ఓటేయాలని గట్టిగా నిలదీయండి. ‘వైఎస్సార్ పాలన చూశాం.. ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ పథకాలు చూశాం.. ఆ పథకాలతో బాగుపడ్డాం.. ఆ పథకాలు కాంగ్రెస్ పథకాలేనని మీరు చెప్పుకుంటున్నారు. మరి అవి కాంగ్రెస్ పథకాలైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఆ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు’ అని నిలదీయండి. వైఎస్సార్ పాలనను తమ పాలన అని సిగ్గులేకుండా చెప్పుకునే దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్. తమ స్వార్థం కోసం ఎవరినైనా ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టడానికి కూడా వెనుకాడని నీచమైన పార్టీ కాంగ్రెస్.

 పక్క రాష్ట్రంలో చూసి రమ్మని చెప్పండి
 టీడీపీ వాళ్లు ఓట్లడగటానికి వస్తే.. వారికి బుద్ది చెప్పండి. ‘అయ్యా..పక్క రాష్ట్రంలో మీ పాలన చూస్తున్నాం. మీ పాలన ఎంత దారుణంగా ఉందో అక్కడి పాలన చూసి రండి’ అని వారికి  చెప్పండి. వెన్నుపోట్లు, మోసం, అబద్దాలు, దగా పునాదులపైనే టీడీపీ ఉంది. అలాంటి టీడీపీకి ఓటేస్తే బాగుపడే పరిస్థితి ఉండదు. బీజేపీ వారిని కూడా అడగండి. ఎన్నికలప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక హామీలిచ్చారు. ఆ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీయండి.

 ఓటడిగే హక్కు మాకే ఉంది
 ఈ ఎన్నికల్లో నిజంగా ఓటడిగే హక్కు, అధికారం ఏ పార్టీకైనా ఉంది అంటే అది ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పండి. ఎందుకంటే ఆ దివంగత నేత వైఎస్సార్.. ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకు మంచి చేశారు. ప్రతి గుండె చప్పుడు విన్న వ్యక్తి వైఎస్సార్. ఆయన సువర్ణ పాలనను మళ్లీ మనం తెచ్చుకుందాం. ఆ పాలన రావాలంటే కలిసికట్టుగా మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మనందరం ఒక్కటై వైఎస్సార్ సువర్ణ యుగం మళ్లీ తెచ్చుకుందాం.

 రాజకీయ చరిత్ర తిరగరాస్తాం: పొంగులేటి
 చీఓరుగల్లు రాజకీయ చరిత్రను తిరగరాయడం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల బరిలో నిలబడిందని... ఈ ఎన్నికల్లో తమకు పోటీ ఎవరూ లేరని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తన తొత్తును ఉప ముఖ్యమంత్రిగా తెచ్చుకునేందుకే వరంగల్ ఉప ఎన్నిక తెచ్చారని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెపాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకపై అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న స్పందన, స్వాగతంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌కు ఎవరూ కూడా పోటీలో లేకుండా పోతున్నారన్నారు.రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే బంగారు తెలంగాణనా అని ప్రశ్నించారు. సీఎం అయ్యాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని కేసీఆర్‌కు మళ్లీ ఓటు వేయవద్దని ప్రజలను కోరారు.

వైఎస్ పథకాలను తుంగలో తొక్కి, ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీకి... ప్రజాప్రతినిధులను రూ. కోట్లతో అంగడిలో పశువుల్లా కొనుగోలు చేయాలని చూసిన టీడీపీకి.. రోజుకో విధంగా వేషం మారుస్తూ హమీలను ఒక్కటి కూడా అమలు చేయని బీజేపీకి ఓట్లు అడిగే అధికారం, హక్కు లేదన్నారు. వరంగల్ ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, ఎడ్మ కిష్టారెడ్డి, ఎ.రెహ్మాన్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కె.శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకులు బీష్వ రవీందర్, వెల్లాల రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, డి.గోపాల్‌రెడ్డి, ఎం.శ్యాంసుందర్‌రెడ్డి, ఎం.భగవంత్‌రెడ్డి, బంగి లక్ష్మణ్, సుమిత్‌గుప్తా, జి.శివ, ఐ.వెంకటేశ్వర్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, కమల్‌రాజ్, ఎం.కల్యాణ్‌రాజ్, కె.నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు