విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీ, హైదరాబాద్లో కేసీఆర్ను కాళ్లావేళ్లా పడి ప్రాధాయపడుతున్నారన్నారు. అధికారంలోకి తెచ్చిన ప్రజలను పట్టించుకోకుండా చంద్రబాబు అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. పైగా ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.
పట్టిసీమ పేరుతో టీడీపీ నేతలు వందలకోట్లు దోచుకున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని అన్నారు. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు రూ.లక్షా 50వేల కోట్లు సంపాదించారన్నారు. చంద్రబాబు అవినీతిని అన్ని గ్రామాల్లో తెలియచేయాలన్నారు. టీడీపీ నిరాధార ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలన్నారు. అలాగే గడప గడపకు వైఎస్ఆర్ కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని, అదే సమయంలో ఊరూరా సభ్యత్వ నమోదు చేయాలని పెద్దిరెడ్డి ఈ సందర్భంగా సూచించారు.