నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ

20 Feb, 2016 09:31 IST|Sakshi
నేడు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జలజాగరణ

అనంతపురం: వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేటి నుంచి రెండురోజులపాటు జలజాగరణ కార్యక్రమం జరుగనుంది. ప్రభుత్వం మెడలు వంచైనా సరే హంద్రీనీవా పథకం ద్వారా చెరువులను నింపడంతో పాటు మొదటి దశ ప్రతిపాదిత అయకట్టుకు సాగునీటిని పోరాడి తెచ్చుకుందాం అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.

జలజాగరణ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నాయకులు హాజరు కానున్నారు. జలజాగరణకు నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు జిల్లాలోని వివిధ మండలాలనుంచి రైతులు తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ నాయకులు జలజాగరణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. జలజాగరణను విజయవంతం చేయాలని కోరుతూ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వారంరోజులుగా నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు, బెళుగుప్ప, కూడేరు మండలాల్లో విసృతంగా పర్యటించి రైతులు, మహిళలు, యువకులు తదితరులను కలుసుకుని జలజాగరణకు సంఘీభావం తెలపాలని కోరారు.

తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణకు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, పీఏబీఆర్ నుంచి ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు అందించే పైపు లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న డిమాండ్లతో జలజాగరణకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బెళుగుప్ప మండలంలో 26,500 ఎకరాలకు సాగునీటిని మొదటిదశలోనే అందించాల్సి ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అనంత కరువును శాశ్వతంగా నివారించాలన్న లక్ష్యంతో చంద్రబాబునాయుడు ఐదు టీఎంసీలతో తాగునీటి పథకంగా రెండుసార్లు శంఖుస్థాపన చేసి వదిలేసిన  హంద్రీనీవా పథకాన్ని  40 టీఎంసీలకు పెంచారన్నారు.  రెండుసార్లు జీడిపల్లి రిజర్వాయర్‌కు  నీటిని కూడా తీసువచ్చారని గుర్తుచేశారు.
 

మరిన్ని వార్తలు