రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలి : ఎంపీ బుట్టా

16 Jun, 2016 09:32 IST|Sakshi
రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలి : ఎంపీ బుట్టా

► రూ.250కోట్లు విడుదల చేయాలి
► వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని
కోరిన ఎంపీ బుట్టా రేణుక

 
కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రిమ్స్/టిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. బుధవారం ఏపీ సెక్రటేరియట్లో ఆమెను కలిసి ఆసుపత్రి, కళాశాల సమస్యలపై విన్నవించారు.

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని ఏరియా ఆసుపత్రికి సంబంధించిన వివిధ ఆధునీకరణ పథకాల నిధుల మంజూరు, స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన మందుల సరఫరా.. తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కర్నూలు బోధనాసుపత్రికి రూ.250కోట్లు కేటాయించి రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పీఎంఎస్‌ఎస్‌వై ప్రోగ్రామ్ కింద ప్రతిపాదనలను పంపించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను ఎంపీగా తాను ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కర్నూలు మెడికల్ కాలేజి డైమండ్ జూబ్లి ఉత్సవాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం కర్నూలులో రెండు, మూడురోజులు పర్యటించి ఈ విషయాలపై చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య చెప్పారు.

మరిన్ని వార్తలు