పొందూరు స‌ర్పంచ్ అక్రమ అరెస్టు

28 Jul, 2017 18:30 IST|Sakshi
పొందూరు స‌ర్పంచ్ అక్రమ అరెస్టు

► టంగుటూరు పీఎస్‌ను ముట్టడించిన గ్రామ‌స్తులు
► వ‌రికూటి అశోక్‌బాబు నేతృత్వంలో 500 మందితో ధ‌ర్నా
► అర్థరాత్రి నుంచి ఉద‌యం 11 వ‌ర‌కు కొన‌సాగిన నిర‌స‌న‌
► సంబంధం లేని కేసులో జైలుకు త‌ర‌లించిన పోలీసులు
► బెయిలు మంజూరు చేసిన జిల్లా కోర్టు


ఒంగోలు: టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అర్ధరాత్రి అరెస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి, రాష్ట్రస్థాయి నాయకుల వరకూ దాడులకు తెగబడుతూనే ఉంది. తాజాగా టంగుటూరు మండ‌లం పొందూరు గ్రామ స‌ర్పంచ్‌ రంగారావును తెలుగుదేశం నేతలు అక్రమంగా అరెస్టు చేయించారు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో రంగారావును అక్రమంగా ఇరికించి అర్థరాత్రి పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు. దీంతో ఆగ్రహం చెందిన వైఎస్సార్సీపీ అభిమానులు  పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. 500 మందికి పైగా వైఎస్సార్సీపీ అభిమానులు, కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి వ‌రికూటి అశోక్‌బాబు నేతృత్వంలో పోలీసుస్టేష‌న్‌కు చేరుకుని గురువారం అర్ధరాత్రి నుంచి ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు ధ‌ర్నా నిర్వహించారు. ఉద‌యం రంగారావును ఒంగోలు జిల్లా కోర్టులో హాజ‌రుప‌రచడంతో జ‌డ్జి ఆయ‌న‌కు బెయిలు మంజూరు చేశారు. దీంతో కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.  ధ‌ర్నాలో  వైఎస్సార్సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి వ‌రికూటి అశోక్‌బాబు, పార్టీ రాష్ట్ర నాయ‌కుడు ఢాకా పిచ్చిరెడ్డి, మండ‌ల అధ్యక్షుడు బొట్ల రామారావు, కొండ‌పి మండల నాయ‌కులు వాకా బాల‌కృష్ణారెడ్డి, వాకా శ్రీకాంత్‌రెడ్డి, పొందూరు గ్రామ నాయ‌కులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రంగారావుపై ఎందుకంత కుట్ర..
పొందూరు గ్రామంలో పోటాపోటీగా జ‌రిగి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ బ‌ల‌ప‌రిచిన‌ అభ్యర్ధిగా రంగారావు విజ‌యం సాధించి స‌ర్పంచ్ అయ్యారు. దీంతో 2014 లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి టీడీపీ నాయ‌కులు ఆయ‌న్ను టార్గెట్ చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ప‌లుమార్లు ఆయ‌న‌ వ్యాపారాల‌పై దాడులు చేయంచ‌డం.. ఆయ‌నకు చెందిన‌ ఆస్తుల‌కు న‌ష్టం క‌లిగించ‌డం చేసిన టీడీపీ నాయ‌కులు.. తాజాగా త‌న‌కేమాత్రం సంబంధం లేని ఓ కేసులో పోలీసుల‌ను పుర‌మాయించి టంగుటూరు పీఎస్‌కు త‌ర‌లించారు. దాదాపు 3 వేల‌కు పైగా ఓట్లున్న పొందూరు గ్రామంలో వైఎస్సార్సీపీకి చిట్నీడి రంగారావు బ‌ల‌మైన నాయ‌కుడు.  పైగా రంగారావుకు మాజీ మంత్రి బాలినేని, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి వ‌రికూటి అశోక్‌బాబుల‌తో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఆయ‌న రాజ‌కీయంగా ఎదిగితే గ్రామంలో టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంద‌నే భ‌యంతోనే టీడీపీ నాయ‌కులు ఆయ‌నపై అస‌త్య ప్రచారంతోపాటు, అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారు. తాజాగా రంగారావుకు ఏమాత్రం సంబంధం లేని కేసులో ఇరికించడం ద్వారా తమ అధికార ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావించింది. కానీ పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ అభిమానులు తరలిరావడంతో వారి ఆటలు సాగలేదు. ఈ సందర్భంగా కొండేపి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి వ‌రికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ టీడీపీ ఆటలు సాగబోనివ్వమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు