ఘనంగా ముగిసిన యానాం ప్రజా ఉత్సవాలు

9 Jan, 2018 08:58 IST|Sakshi

యానాం: 16వ యానాం ప్రజా ఉత్సవాలు చివరి రోజు సోమవారం పాటల సందడితో ఘనంగా ముగిశాయి. ముగింపు రోజు కావడంతో యానాం పరిసర ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ఈ ఉత్సవాలు తిలకించేందుకు తరలివచ్చారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ప్రజా ఉత్సవాల్లో టీవీ, సినీ సంగీత గాయకుల పాటలు అలరించాయి.  ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ పాడిన ఫిదా చిత్రంలోని ‘వచ్చెందే’.. అనే పాటకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. బాహుబలి చిత్రంలోని పాటలను సమీరా భరద్వాజ్‌ పాడి వినిపించారు. సోని, కృష్ణచైతన్య, హనుమ, సాయిశిల్ప తదితరులు పాడిన పాటలు ఆహూతులను అలరించాయి. అనంతరం ప్రత్యేక మ్యాజిక్‌ కార్యక్రమం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో పుదుచ్ఛేరి ఆరోగ్యశాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కమిషనర్‌ గౌరీ సరోజ, ఎస్పీ నితిన్‌ గోహల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు