మనసు, మాట, చేత ఒకటి కావాలి

10 Feb, 2018 11:22 IST|Sakshi
ఆటోను స్వాధీనం చేసుకుంటున్న విజిలెన్స్‌ అధికారులు

సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు   

ప్రారంభ సభలో వక్తల ఉద్బోధ

‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని వక్తలు ఉద్బోధించారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

రాజమహేంద్రవరం కల్చరల్‌: ‘మనసులో ఉన్న భావనే మాటగా వెలువడాలి. మాటలు చేతలు కావాలి. ఇది మహాత్ముల లక్షణ’మని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముర్రు ముత్యాలునాయుడు అన్నారు. శ్రీరామకృష్ణ మిషన్, వివేకానంద ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామకృష్ణమఠంలో సోదరి నివేదిత 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి,. ముఖ్య అతిథిగా ముత్యాలు నాయుడు మాట్లాడుతూ ఈ దేశానికి రామకృష్ణ పరమహంస, వివేకానందుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, కానీ సోదరి నివేదిత గురించి తెలియనివారు చాలామంది ఉండవచ్చని అన్నారు. చికాగో వెళ్ళేటప్పుడు వివేకానందునికి బోస్టన్‌ నగరంలో నివసిస్తున్న ఒక మహిళ పరిచయమై, తన విజిటింగ్‌ కార్డును ఇచ్చిందన్నారు. చికాగో ప్రపంచ మత సమ్మేళన సభలు మూడు నెలలు వాయిదా పడి, తెచ్చుకున్న ధనం అయిపోవడంతో వివేకానందుడు ఆ మహిళ ఇంటికి వెళ్ళి కొంతకాలం బస చేశారని చెప్పారు.

అక్కడికి వచ్చిన అమెరికన్‌ ప్రొఫెసర్‌ ఒకరు వివేకానందుని వాగ్ధాటికి అచ్చెరువొంది ‘ఈ దేశంలో ప్రొఫెసర్లందరూ కలసినా వివేకానందునికి సాటి రా’రని అన్నారు. లండన్‌లో సోదరి నివేదిత వివేకానందుని ప్రసంగానికి ముగ్ధురాలై అన్ని మతాలూ ఒకే దారిచూపుతాయని  గ్రహించిందని, వివేకానందుని పిలుపుమేరకు ఈ గడ్డపై కాలు మోపిందని వివరించారు. మహాత్మునికి, సోదరి నివేదితకు పోలికలు ఉన్నాయని, గోపాలకృష్ణ గోఖలే మహాత్ముని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించగా వివేకానందుడు నివేదితను ఈ గడ్డపై సామాజిక సేవ చేయవలసిందిగా పిలుపునిచ్చారన్నారు. నివేదిత, కాటన్, బ్రౌన్‌ ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు.    గ్లోబల్‌ హాస్పిటల్స్‌ సలహాదారుడు డాక్టర్‌ కె.ఎస్‌.రత్నాకర్‌ మాట్లాడుతూ  విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తే సమాజం నాశనమవుతుందన్నారు.

యువత పే, ప్రాస్పెక్ట్స్, ప్రమోషన్‌ అనే మూడు అంశాలపై  మాత్రమే దృష్టి సారించరాదన్నారు. సభకు అధ్యక్షత వహించిన రామకృష్ణ మిషన్, బేలూరు ప్రధాన కార్యదర్శి స్వామి అభిరామానందజీ  మాట్లాడుతూ మన దేశంలో యువకులు, మానవవనరుల సంఖ్య ఇతర దేశాలకన్నా ఎక్కువన్నారు. విద్య అంటే కేవలం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదని, వ్యక్తిత్వ వికాసం మెరుగుపరుచుకోవాలని సూచించారు. నగరాధ్యక్షుడు స్వామి కపాలీశానంద స్వాగత వచనాలు పలికారు. విజయవాడ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి శేవ్యానందజీ, విశాఖపట్టణం మిషన్‌కు చెందిన గుణేశానందజీ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి ముత్యాలునాయుడిని నిర్వాహకులు సత్కరించారు. స్వామి హరికృపానందజీ వందనసమర్పణ చేశారు. ఉత్సవాలు శని, ఆదివారాల్లో కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు