రాజమహేంద్రవరం నగరం నవ్వుల విరిజల్లుల్లో తడిసి ముద్దయింది. వైశ్యా హాస్టల్ నూతన భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్టార్ నైట్ కార్యక్రమంలో బుల్లితెర హాస్య కళాకారులు ఆద్యంతం నవ్వులు పండించి, ప్రేక్షకులను ఆనందాల గోదారిలో ముంచెత్తారు. సినీ హాస్యనటుడు బ్రహ్మానందంతోపాటు, హీరోయిన్ సురభి, హాస్యనటులు, యాంకర్లు ఆలీ, ఆది, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రష్యన్ కళాకారుల ప్రదర్శన ఆకట్టుకొంది.
తాడితోట (రాజమహేంద్రవరం): వైశ్య హాస్టల్ నూతన భవనం నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్టార్ నైట్ అలరించింది. ఆదివారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివ రామసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో లాలా చెరువులో వైశ్య హాస్టల్ నూతన భవనం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్టార్ నైట్ అలరించింది. హాస్టల్ విద్యార్థుల సౌజన్యంతో స్టార్ నైట్ నిర్వహించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీఘాకోళపు శివ రామ సుబ్రహ్మణ్యంను అభినందించారు. తాను ఒంగోలులో వైశ్య హాస్టల్లో చదువుకున్నానని, వైశ్యులంటే తనకు అపార గౌరవమని పేర్కొన్నారు. ప్రముఖ హాస్య నటుడు ఆలీ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఏ కార్యక్రమం జరిగినా తనకు ఆహ్వానం అందుంతుందని, తాను పాల్గొన్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. జబర్దస్త్ బృందం సభ్యులు ఆది, రాంప్రసాద్, పొట్టి రమేష్, రోబోలు పాల్గొని ప్రేక్షకులను అలరించారు.
ప్రముఖ గాయని సునీత, ప్రముఖ టీవీ యాంకర్లు రవి, శ్రీముఖి, నటి సురభి పాల్గొన్నారు. రష్యన్ కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ కళాకారులు సినిమా పాటలకు నృత్యాలు చేశారు. అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, అడిషనల్ ఎస్పీ రజనీకాంత్ రెడ్డి, సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ భరత్ మాతాజీ, శ్రీనివాసరావు, వైశ్య హాçస్టల్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కోట్ల కనకేశ్వరరావు, కార్యదర్శి సత్యవరపు సత్యనారాయణ మూర్తి, కోశాధికారి మడవిల్లి శివ, వైశ్య ప్రముఖులు మన్యం ఫణికుమార్, వంకాయల శ్రీనివాసరావు పాల్గొన్నారు.