రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
గోకవరం (జగ్గంపేట): పాత సంవత్సరం ముగింపు రోజుల్లో విషాదం నెలకొంది. గోకవరం మండలం సింగారమ్మచింత సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఏజు ఆదిత్య(16), గెడ్డం కిషోర్(18), మందా రవి బైక్పై శనివారం రాత్రి జగ్గంపేట వైపు నుంచి గోకవరం వైపు వస్తుండగా సింగారమ్మచింత సమీపంలో మల్లవరం జంక్షన్ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆదిత్య, కిషోర్లు అక్కడికక్కడే మృతి చెందగా బైక్ నడుపుతున్న రవి తీవ్రంగా గాయపడ్డాడు.
విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై టి.వెంకటసురేష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. మృతులు ఆదిత్య, కిశోర్లు ఇంటర్మీడియట్ చదువుతున్నారని, గాయపడిన రవి పెయింటింగ్ వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.