గుర్రమే కాదు రౌతు కూడా మారాలి

11 Feb, 2015 00:12 IST|Sakshi
గుర్రమే కాదు రౌతు కూడా మారాలి

ప్రభుత్వ విధానాలకు బద్ధులై పనిచేయాల్సిన అధికార యంత్రాంగం చేసే తప్పులలో తన ప్రమేయం లేదని ప్రభుత్వం తప్పించుకోలేదు. మూలం నుంచే సంస్కరణ జరగాలి. అధికారులు, నేతలు కూడా నైతిక విలువలకు కట్టుబడి పనిచేయాలి. అప్పుడే గోస్వామి వంటివారు పరిధులు దాటి చలాయించే అధికారాలకు అడ్డుకట్ట పడుతుంది.

దేశ అధికార యంత్రాంగానికి ఇప్పుడు ‘ఫోన్’ అంటేనే వణుకు పుడుతోంది. శారదా కుంభ కోణం నిందితుల అరెస్టును ఆపాలని కోరుతూ సీబీఐ అధి కారులకు ఫోన్ చేసినందుకు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిపై వేటు పడటమే ఇందుకు కారణం. సీబీఐ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తే సహించేది లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంత గంభీరంగా చెబుతున్నా... ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ప్రభుత్వం పనితీరు గొప్పతనాన్ని ఓటర్లకు చాటాలనే ఉద్దేశమే అసలు కారణమనే వాదనను కాదనలేం. ఏదేమైనా, గోస్వామి ఉదంతం అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు మధ్య సంబంధాలు, అధికారుల పనితీరులో, తప్పిదాల్లో నేతల పాత్ర, బాధ్యత ఎంత? అనే అంశాలను చర్చకు తెచ్చింది. ఇది ముదావహం.

తన అధికారాల పరిధిని దాటడమే అనిల్ గోస్వామి తప్పయితే ఆయనపై వేటు ఎన్నడో పడాల్సింది. నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి హోదాలో ఆయన పలు రాష్ట్రాల గవర్నర్లకు ఫోన్లు చేశారు. ప్రభు త్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలని కోరారు. అలా గవర్నర్ల తో నేరుగా మాట్లాడటం తన అధికార విధుల్లో భాగ మేనని అప్పట్లో ఆయన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తన చర్యను సమర్థించుకున్నారు. ఆ సంద ర్భంగా బీజేపీ ప్రభుత్వం,  గోస్వామిని సమర్థించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్లు మారడం సాంప్రదాయమని సూత్రీకరించింది కూడా. రాజకీయ నాయకత్వం అభీష్టానుసారమే గోస్వామి గవర్నర్ల రాజీనామాలు కోరారనేది స్పష్టమే.

‘‘ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అభీష్టం అనేది కేంద్ర మంత్రివర్గ సలహాపై ఆధారపడి ఉండేదే అయినా అది, అతడు లేదా ఆమెకు మాత్రమే చెందినది. దాని గురించి ఎలాంటి సమాచా రాన్ని చేరవేయడమైనా రాష్ట్రపతి కార్యాలయం నుంచి జరగాల్సిందే. ‘అభీష్టం’ బదలాయించగలిగినది కాదు.’’ ఇవి ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ కేసులో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అన్న మాటలు. గవర్నర్ల కు రాజీనామాలు చేయాలనే సమాచారం అందించా ల్సింది రాష్ట్రపతి కార్యాలయం కాగా గోస్వామి ఆ పని చేసి, తన పరిధిని అతిక్రమించారు. అది తప్పుగా అప్ప ట్లో కేంద్రానికి కనిపించలేదు. ఇప్పుడు సీబీఐ అధికా రులతో ఫోన్లో మాట్లాడటమే తప్పుగా కనిపిస్తోంది. అధి కారంలోని నేతల ఆదేశాల మేరకు లేదా అభీష్టం మేరకు పనిచేసే అధికారుల తప్పొప్పులకు కొలబద్ధ నేతల ఇష్టా యిష్టాలు, విచక్షణ మాత్రమేనని అనుకోవాలి!

ఈ సమస్య కొత్తదేమీ కాదు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన నిందితుడు ఆండర్సన్ దేశం నుంచి తప్పించుకు పోయినది నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్, రాజీవ్‌గాంధీల అభీష్టం మేరకేననేది బహిరంగ రహస్యం. నిందితులు నిమిత్తమాత్రులైన జిల్లా అధికా రులా? లేక అసలు సూత్రధారులా? ఇలాంటి సందర్భాల్లో చర్య తీసుకోవాల్సింది ఎవరిపైన? ఈ చర్చ దశా బ్దాలుగా సాగుతోంది. మన పార్లమెంటరీ విధానం ప్రకా రం ప్రభుత్వ చర్యలకు కార్యనిర్వహణాధికారులే అంటే మంత్రులే బాధ్యులు. నెహ్రూ హయాంలో హరిదాస్, ముంద్రా కంపెనీల నుంచి ఎల్‌ఐసీ షేర్ల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయమేమీ లేదని, దానికి ఆర్థిక కార్యదర్శి హెచ్‌ఎమ్ పటేల్‌దే బాధ్యతని నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి చేసిన వాదన చెల్లలేదు. ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అలాగే గోవధ వ్యతిరేక నిరసన ప్రదర్శనలకు అనుమతినిచ్చింది తాను కాదన్న  నాటి హోం మంత్రి గుల్జారీలాల్ నందా వాదన చెల్లక రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయ కార్య నిర్వాహకుల బాధ్యతను గుర్తు చేయడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అంతేగానీ అధికారులు చట్టాలకు అతీతులూ కారు. గోస్వామి ఫోన్ల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనీ కాదు.

ప్రజా సేవలో ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా పని చేయాలనే అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాంగ రక్షణ కల్పించారు. అయితే వారు ప్రభుత్వ విధానాలకు, నిర్ణయాలకు బద్ధులై పనిచేయాలి. వాటి పట్ల అభ్యంతరాలుంటే అసమ్మతి నోట్ ఇవ్వవచ్చు. ప్రభుత్వాలతో విభేదించి ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేసిన శంకరన్ వంటి అధికారులెందరినో చూశాం.

కానీ అశోక్ ఖేమ్కా ఉదంతం, సీబీఐ కేసుల పాలైన బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఉదంతం క ళ్లముందుండగా స్వతంత్రంగా ప్రజా సంక్షేమానికి తెగించేదెందరు? అవినీతి, అక్రమాల నుంచి బూటకపు ఎదురుకాల్పుల వరకు అధికార యంత్రాంగం పాత్ర లేదని ఎవరూ అనడం లేదు. ప్రభుత్వ విధానాలకు బద్ధులై పనిచేయాల్సిన అధికార యంత్రాంగం తప్పులలో తమ ప్రమేయం లేదని మంత్రులు తప్పించుకోలేరు. మూలం నుంచే సంస్కరణ జరగాలి. గుర్రమే కాదు రౌతు కూడా మారాలి. అధికారులే కాదు, వారిని శాసించే నేతలు కూడా నైతిక విలువలకు కట్టుబడి, ప్రజాహితం కోసం పని చేయాలి. అప్పుడే గోస్వామి వంటివారు పరిధులు దాటి చలాయించే అధికారాలకు అడ్డుకట్ట పడుతుంది.

(వ్యాసకర్త సామాజిక కార్యకర్త మొబైల్ నం: 9394486016)

మరిన్ని వార్తలు