‘ఈశాన్యం’లో కాషాయం

6 Mar, 2018 02:46 IST|Sakshi

గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ నినాదంతో అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత కొన్ని మినహాయింపులతో ఆ పనిలో విజయవంతమవుతూనే ఉంది. కానీ సీపీఎం విషయంలో అలాంటి నినాదమేదీ ఇవ్వకుండానే త్రిపురలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని తుడిచిపెట్టింది. త్రిపురలో 60 స్థానాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరగ్గా బీజేపీకి 35 లభించాయి. ఆ పార్టీ కూటమిలోని ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ)కి వచ్చిన 8 సీట్లు లెక్కలోకి తీసుకుంటే కూటమి బలం 43 అవుతుంది.

సుదీర్ఘకాలం నుంచి ఆ రాష్ట్రాన్నేలుతున్న సీపీఎం 16 సీట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. 60 సీట్లున్న మేఘాలయలో అత్యధి కంగా... అంటే 21 స్థానాలొచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ ఆవిర్భవించినా ఆ పార్టీకి అధి కారం దక్కకుండా చేయడంలో బీజేపీ కృతకృత్యమైంది. అక్కడ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) బీజేపీ ఆశీస్సులతో మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోంది. 60 స్థానాలున్న నాగాలాండ్‌లోనూ అదే పరిస్థితి.

అక్కడ ఇంతవరకూ పాల కపక్షంగా ఉన్న నాగాలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌)కు 27 స్థానాలు లభించి అతి పెద్ద పార్టీగా ఉన్నా 17 స్థానాలు వచ్చిన నాగాలాండ్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)యే 12 స్థానాలున్న బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబో తోంది. ఎన్నికల ముందు బీజేపీ ఎన్‌పీఎఫ్‌తో ఉన్న పదిహేనేళ్ల చెలిమిని విడిచి ఎన్‌డీ పీపీతో జట్టు కట్టింది. తాజా ఎన్నికల తర్వాత ఈశాన్యంలో ఒక్క మిజోరం తప్ప మిగిలినచోట్ల కాంగ్రెస్‌ కనుమరుగైంది. క్రైస్తవ మత ప్రాబల్యం అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడటం, పైగా పాతికేళ్లుగా సీపీఎం ఏలు తున్న త్రిపురను సైతం తన ఖాతాలో వేసుకోవడం అసాధారణమే.  

త్రిపురలో ఇంతవరకూ ఒకే ఒక్క స్థానం ఉన్న బీజేపీకి ఒక్కసారిగా 35 స్థానాలు రావడం, ఆ పార్టీతో కలిసి పోటీచేసిన ఐపీఎఫ్‌టీకి 8 రావడం సాధారణ విషయం కాదు. అయితే ఓట్ల శాతం రీత్యా చూస్తే బీజేపీ, సీపీఎంల మధ్య పెద్ద తేడా లేదు. బీజేపీకి 43 శాతం ఓట్లు లభిస్తే సీపీఎంకు 42.7 శాతం వచ్చాయి. ఇన్నాళ్లనుంచీ సీపీఎంకు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్‌ తన ఓట్ల శాతాన్ని కోల్పో నట్టయితే బహుశా బీజేపీకి ఇక్కడ విజయం సాధ్యమయ్యేది కాదు. కానీ 2013లో 36.5శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌ ఈసారి 1.5 శాతానికి పడిపోయింది.

34 ఏళ్లపాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన  పశ్చిమబెంగాల్‌లో సీపీఎం అధికారం కోల్పోయి ఏడేళ్లవుతోంది. దానికి త్రిపుర కూడా ఇప్పుడు తోడైంది. ఇక అయిదేళ్లకో సారి పాలక పక్షాన్ని మార్చే అలవాటున్న కేరళ మాత్రమే ప్రస్తుతం సీపీఎం నేతృ త్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌) చేతిలో ఉంది. సుదీర్ఘకాలం అధికా రంలో ఉండటం ఏ పార్టీకైనా బలమూ, బలహీనత కూడా. బలం ఎందుకంటే– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో పార్టీ ప్రజలకు చేరువ కావొచ్చు. పలుకుబడిని పెంచుకోవచ్చు. సంస్థాగతంగా పటిష్టం కావొచ్చు.

అయితే అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత గూడుకట్టుకుంటుంది. ధీమా ఏర్పడుతుంది. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో పైనున్న నాయకత్వానికి అందకుండా పోతుంది. కేరళ వంటి రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వమూ, శ్రేణులూ కూడా నిరంతర జాగురూకతతో ఉంటారు. ఎక్కడేం జరుగుతున్నదో, దాన్ని అనుకూలంగా మలుచుకొనేందుకూ లేదా అధిగ మించేందుకూ చేయాల్సిందేమిటో నిరంతరం చర్చించుకునే ప్రక్రియ కొనసాగు తుంది. త్రిపురలో 2013 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక సీటుతో, రెండు శాతంలోపు ఓట్లతో ఉన్న బీజేపీ ఈసారి సవాలు విసిరినప్పుడు సీపీఎం తేలిగ్గా తీసుకుంది.

కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకొ చ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ నిర్దిష్ట కార్యాచరణతో పనిచేస్తున్నదనీ, ముఖ్యంగా రెండేళ్లుగా వేలాదిమంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు బీజేపీ అనుకూల వాతావరణం ఏర్ప డటానికి కృషి చేస్తున్నారని సీపీఎం శ్రేణులు సరిగా గుర్తించలేకపోయాయి. ముఖ్య మంత్రి మాణిక్‌ సర్కార్‌ వ్యక్తిగతంగా నిరాడంబరుడే కావొచ్చు... సొంతానికి ఇల్లు కూడా లేకపోవచ్చు... నిజాయతీతో కూడిన పాలన అందించి ఉండొచ్చు–కానీ రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో పాతుకుపోయిన బెంగాలీ సంస్కృతి ఆధిపత్యంపై గిరి జనుల్లో గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో ఆ పార్టీ విఫలమైంది.

త్రిపురలో 31శాతంమంది గిరిజనులు. వారిలో ఎక్కువమంది మాట్లాడే కోక్‌బోరాక్‌ భాష కాకుండా బెంగాలీయే అధికార భాషగా, బోధనాభాషగా చలామణి కావడం ఆ అసంతృప్తికి కారణం. రెండున్నర లక్షలమంది రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి జీతాల విషయంలోనూ ఈ తరహా ఆగ్రహమే ఉంది. గత జూన్‌లో ప్రభుత్వం నాలుగో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిందిగానీ తాము అధికారంలోకొస్తే ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. అది అమలైతే ప్రభుత్వ సిబ్బందికి ఒక్కసారిగా రెట్టింపు వేతనం లభిస్తుంది.

దీనికితోడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య కూడా సీపీఎంకు ప్రతికూలంగా మారింది. దేశంలో అత్య ధిక నిరుద్యోగం(19.7శాతం) త్రిపురలోనే ఉంది. 2016 జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం జాతీయ సగటు కంటే త్రిపురలో ఆత్మ హత్యల రేటు కూడా అధికమే. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. వాటినిబట్టే ఒక పార్టీ బలాన్ని లేదా బలహీనతల్ని లెక్కేయలేం. అయితే త్రిపురకూ, ఈశాన్య ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలకూ తేడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పార్టీలు దాదాపుగా ఆయా ప్రాంతాల్లోని గిరిజన తెగలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ త్రిపురలో కార్యకర్తలు పునాదిగా ఉన్న పార్టీ సీపీఎం.

మళ్లీ ఆ స్థాయిలో శ్రేణులున్న బీజేపీ అడుగుపెడితే తప్ప సీపీఎంను ఓడించడం మరెవరికీ సాధ్యం కాలేదు. మొత్తానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న తీరు ఆ ప్రాంతం అభివృద్ధికి ఏ స్థాయిలో తోడ్పడగలదో వేచిచూడాలి. గొడ్డు మాంసం వంటి అంశాల్లో దేశంలో ఇతరచోట్ల ఉన్నట్టు ఈశాన్యంలో వ్యవహరిస్తే బీజేపీ వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. ఈ విజయంలోని పరిమితులేమిటో ఇతరుల కంటే బీజేపీకే ఎక్కువ తెలుసు.

మరిన్ని వార్తలు