చరిత్రాత్మక నిర్ణయం

5 Sep, 2019 01:07 IST|Sakshi

కొత్తగా అధికారంలోకొచ్చినవారిపై అందరి దృష్టీ ఉంటుంది. వారి నిర్ణయాలెలా ఉన్నాయో, వారి అడుగులు ఎటు పడుతున్నాయో, ఎన్నికల్లో చేసిన బాసల సంగతేం చేశారో జనం గమనిస్తూ్తనే ఉంటారు. ఎవరెవరి వల్లనో సాధ్యం కావడం లేదని సాకులు చెబుతున్నా, కమిటీలతో కంటితు డుపు చర్యలకు పరిమితమైనా వారు ఇట్టే పసిగడతారు. అధికారంలోకొచ్చి నెలరోజులైనప్పుడూ, వందరోజులైనప్పుడూ, ఏడాదైనప్పుడూ పాలకులు పండుగ చేసుకోవడం రివాజు. కానీ వారు ఇచ్చిన హామీలనూ, వారి ఆచరణనూ పోల్చి చూసుకోవడానికి సామన్యులకు అవి సందర్భాల వుతాయి. కొన్నింటిలోనైనా ఫర్వాలేదనిపించినప్పుడు మాత్రమే ప్రజలు సైతం ఏదో మేరకు ఆ పండుగల్లో భాగస్వాములవుతారు. 

కానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫర్వాలేదనిపించడం కాదు... ఎన్ని వాగ్దానాలు పరిపూర్తి చేయవచ్చునో అన్నీ చేసి, అన్నివిధాలా తన పాలనా దక్షతను నిరూపించుకుని వంద రోజుల పాలనలో వంద శాతం మార్కులు సాధిం చారు. తాజాగా బుధవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. దీని ఫలితంగా ఆ సంస్థలో పనిచేస్తున్న 52,813మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ఇందు కోసం ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖను ఏర్పాటుచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు, నియమనిబంధనలు విలీనం కాబోతున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. వారి ఉద్యోగ విరమణ వయసు కూడా 60 ఏళ్లకు పెంచారు.  విలీన ప్రక్రియ మొత్తం మూడు నెలల్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించడం ఆయన చిత్తశుద్ధికి మచ్చుతునక. 

ఆర్టీసీ సిబ్బంది ఎన్నో ప్రతికూల సమస్యల మధ్య నిత్యం లక్షలాదిమందిని గమ్యస్థానాలు చేరుస్తుంటారు. వారి కృషి కారణంగానే కనిష్టస్థాయిలో ప్రమాదాల రేటు ఉండటం, విడిభాగాల అవసరం తరచుగా లేకపోవడం, బస్సు టైర్ల మన్నిక మెరుగ్గా ఉండటం వంటివి సాధ్యమవు తున్నాయి. వీటిన్నిటా దేశంలోని ఇతర కార్పొరేషన్లకు ఆర్టీసీ ఆదర్శంగా నిలిచింది. ప్రమాణాల విషయంలో కూడా ఆర్టీసీది అగ్రస్థానమే. విభజన తర్వాత సైతం అది మంచి పనితీరు కనబరి చింది. అయినా ఆ సంస్థను సమున్నతంగా నిలబెట్టడంలో, దానికొచ్చే నష్టాలను తగ్గించడంలో బాబు ప్రభుత్వం గతంలో దారుణంగా విఫలమైంది. తాము అధికారంలోకొస్తే ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వ సిబ్బందితో సమానంగా వేతనాలిస్తామని 2014 ఎన్నికల సమయంలో నమ్మబలికిన చంద్రబాబు ఆ తర్వాత చేతులెత్తేశారు. దాన్ని గురించి సిబ్బంది అడిగినప్పుడూ లేదా అడుగుతార నుకున్నప్పుడూ ఆర్టీసీ భారీ నష్టాల్లో ఉన్నదని, ప్రభుత్వం దాని ఆస్తుల్ని ప్రైవేటీకరించే ఆలోచన చేస్తున్నదని అనుకూల మీడియాలో కథనాలు రాయించేవారు. 

కిలోమీటర్‌కు రూ. 8 నష్టం వస్తోం దన్న సాకుతో పల్లె వెలుగు బస్సుల్ని కుదించే ప్రయత్నాలు జరిగాయి. సిబ్బంది సంఖ్యను తగ్గించు కోవడానికి రకరకాల ఎత్తుగడలు వేశారు. విమాన ఇంధనంపై సర్‌చార్జిని నామమాత్రంగా వసూలు చేసి పెద్ద మనసు చాటుకున్న బాబు సర్కారు ఆర్టీసీ బస్సులకు వాడే డీజిల్‌పైనా, విడిభాగాలపైనా భారీ స్థాయిలో వ్యాట్‌ విధించి ఆ సంస్థ సొమ్మును కొల్లగొట్టేది. ఒకపక్క బస్సు మాఫియాతో చెట్ట పట్టాలు వేసుకుని, వారి ప్రయోజనాలను నెరవేర్చడం కోసం ప్రైవేటు సర్వీసుల విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించి సంస్థ నష్టాలకు మాత్రం కార్మికుల్నే బాధ్యులుగా చూపేది. ఒక్కమాటలో చెప్పాలంటే వారిని నిత్యం అనిశ్చితిలో ఉంచేది. నామ మాత్రంగా ఒక కమిటీ వేసి, దాని పదవీకాలాన్ని నిరవ ధికంగా పొడిగిస్తూ పోవడం, చివరికి అదె ప్పుడో సిఫార్సులు చేశాక, ఆ నివేదిక పరిశీలనకు కేబి నెట్‌ ఉపసంఘం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత మరెన్నాళ్లకో ఆ ఉపసంఘం నివేదిక ఇవ్వడం, చివ రాఖరికి నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టడం బాబు మార్కు విధానం. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆర్టీసీ విలీనం విషయంలో ఏమాత్రం శషభిషలు ప్రదర్శించలేదు. అధికారంలోకొచ్చిన పక్షం రోజుల్లోనే పోలీసు మాజీ ఉన్నతాధికారి సి. ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఆరుగురితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం, మూడు నెలల వ్యవధిలో నివే దిక ఇవ్వాలని ఆ కమిటీకి సూచించడం చకచకా జరిగాయి. ఆంజనేయరెడ్డి పోలీసు విభాగంలోనూ, ఆర్టీసీలోనూ సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. కార్మిక సంఘాలు మొదలుకొని భిన్న రంగాల వారితో ఆ కమిటీ చర్చించింది. వచ్చిన సూచనలన్నిటినీ పరిశీలించి తనకిచ్చిన వ్యవధిలోనే ప్రతి పాదనలు సమర్పించింది. వాటిని పరిశీలించి విలీనానికి ఆమోదముద్ర వేయడంతోపాటు మూడు నెలల్లో ఈ ప్రక్రియంతా పూర్తి కావాలనిరవాణా, ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలను సీఎం ఆదేశించారు. 

ప్రభుత్వాధినేత అంకిత భావంతో పని చేస్తే, పాలనాదక్షత కనబరిస్తే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో చెప్పడానికి ఆర్టీసీ విలీన నిర్ణయం పెద్ద ఉదాహరణ. ఈ చరిత్రాత్మక నిర్ణయం ద్వారా దేశంలోని పాలకులందరికీ జగన్‌ ఆదర్శప్రాయుడయ్యారు. ఇకపై మరింత క్రియా శీలంగా పనిచేసి, దాన్ని లాభాల బాట పట్టించడం ప్రజా రవాణా శాఖలో భాగస్వాములై ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్న ఆర్టీసీ సిబ్బంది కర్తవ్యం కావాలి. ఇది విఫలం కావాలని ఆశించే శక్తులు రాష్ట్రంలో పొంచి ఉన్నాయి. ఆ శక్తులే ఇన్నాళ్లూ ప్రభుత్వాల్లో చక్రం తిప్పి ఆర్టీసీని అన్ని విధాలా ముంచేశాయి. దశాబ్దాల తమ కలను సాకారం చేసుకున్న సిబ్బంది ఆ శక్తుల పట్ల అప్రమ త్తంగా ఉండాలి. వారు తమ కర్తవ్య నిర్వహణలో సాధించే విజయం ఇతర రాష్ట్రాల్లోని రవాణా కార్పొరేషన్‌ ఉద్యోగులకు స్ఫూర్తినిస్తుంది. తమను విలీనం చేస్తే కలిగే మేలేమిటో అక్కడి ప్రభు త్వాలకు వారు చెప్పగలుగుతారు.

మరిన్ని వార్తలు