ముందస్తుగానే ‘సార్వత్రికం’?!

5 Jun, 2018 01:23 IST|Sakshi

రెండో మాట 

2018 చివరి మాసాల్లోగానీ, 2019 తొలి మాసాలలో గానీ ఇండియాలో లోక్‌సభకు మధ్యంతర లేదా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని  ప్రసిద్ధ ‘నొమూరా’ సంస్థ జోస్యం చెప్పింది. మోదీ ‘సంస్కరణలు’ ముందుకు సాగే పరిస్థితి లేదని నొమూరా అభిప్రాయపడుతోంది. ప్రస్తుత ‘సంస్కరణలు’ ప్రజా బాహుళ్యం విశాల ప్రయోజనాల వికాసానికి తోడ్పడేవి కావని నాలుగేళ్ల బీజేపీ పాలన రుజువు చేసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ ‘సంస్కరణలు’ దేశీయ ఉత్పత్తుల విలువలో ఏర్పడే ద్రవ్యలోటును భర్తీ చేసుకోగల స్థితిలో కూడా లేవని ‘నొమూరా’ విశ్లేషించింది.

‘‘భారతదేశంలో ఇటీ వల కాలంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల కార ణంగా, బాదరబందీలనుంచి బయటపడే ప్రయ త్నంలో దేశవ్యాప్తంగా 2018 ఆఖరి మాసాల్లోగానీ, 2019 తొలి మాసాలలోగానీ మధ్యంతరంగా జనరల్‌ ఎన్నికలను ప్రకటించే అవకాశం ఉంది. ఫలితంగా ప్రధాని మోదీ సంస్కరణలకూ గండి పడే అవకాశం ఉంది’’. – టోక్యో కేంద్రంగా ఉన్న ప్రసిద్ధ ప్రపంచ ద్రవ్య వ్యవహారాల నిర్వహణ సంస్థ నొమూరా అంచనా. ‘‘ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి 2019లో ఏదో ఒక దశలో ముగుస్తుంది. కానీ ఈలోగా ఏం జరు గుతుందో, ఏం జరగదో మీరే ఊహించుకోవచ్చు. అయితే లోక్‌సభ–శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు మాత్రం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఒ.పి. రావత్‌ సమాధానం దాట వేశారు’’.

కలకత్తాలో 2.6.2018న రావత్‌ పత్రికా గోష్ఠిలో.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రావత్‌ ఎప్పుడేం మాట్లాడతారో ఊహించటం కష్టం. కేంద్ర స్థాయిలో బీజేపీ–ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేంద్ర సంస్థల అధికారగణం లాగానే రావత్‌ కూడా ‘అస్తుబిస్తు’గా సమాధానాలు చెప్పే సంస్కృతికి అలవాటుపడ్డారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) నిర్వహణ, అవి పనిచేసే తీరు గురించి 2014 ఎన్నికల నుంచి పెద్ద రగడ ప్రారంభమైంది. ఈవీఎంల వల్ల అనేక సంద ర్భాల్లో ఓటింగ్‌ సరళిలో, లెక్కింపులో పలు రకాల అవకతవకలకు ఆస్కారముందనే అనుమానాలు రావడంతో దేశవ్యాప్తంగానే ఆందోళన మొదలైంది. ఓటర్ల రహస్య ఓటు హక్కుకు సంపూర్ణ భద్రత కల్పించడంలో ఎలక్ట్రానిక్‌ యంత్రాలు విఫలమవుతు న్నాయని అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా తిరిగి బ్యాలెట్‌ పేపర్ల విని యోగమే ఓటర్ల హక్కుకు గ్యారంటీ అన్న వాదన ప్రజల్లో ప్రబలమవుతూ వచ్చింది.

ఈవీఎంల భాగాల్లో ఏ ‘మతలబు ఇమిడి ఉందో’నన్న అను మానాలకు కారణాలు లేకపోలేదు. విదేశాల్లో ఎల క్ట్రానిక్‌ యంత్రాల పని విధానాన్ని ఎలా తారుమారు చేయొచ్చో సాంకేతిక నిపుణులు నిరూపించారు. ఈ అనుమానాల నివృత్తి కోసం ఇటీవల కొన్ని రాష్ట్రా లలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఈవీఎం లతోపాటు ఓటరు వెరిఫికేషన్‌ కోసం ప్రత్యేక పేప ర్‌ను కూడా జోడించటానికి(వీవీపాట్‌) ప్రత్యేక ఏర్పాట్లూ జరిగాయి. కానీ ఆచరణలో  ఈవీఎంలూ, వీవీపాట్‌లు అనేకచోట్ల మొరాయించాయి. ఫలి తంగా ఈ మెషీన్ల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు తీరలేదుగదా, మరింతగా పెరిగిపోయాయి. పార్టీ లకు, వాటి అభ్యర్థులకూ అనుకూలంగా మెషీన్ల తయారీ, పనితీరులో ఎలా మార్పులూ చేర్పులూ చేయవచ్చునో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఒక హాస్యా స్పదమైన తీర్పును (2.6.2018) వెల్లడించారు. 

‘‘పోలింగ్‌ జరుగుతున్న సమయంలో ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించడానికి కారణం– పోలింగ్‌ సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడమే. శిక్షణ ఇచ్చిన నిమిషం సమయంలోనే సిబ్బంది ఎంతసేపూ మొబైల్‌ఫోన్లు, వాట్సాప్‌లకు అంటుకుపోవడంతో తగిన శిక్షణకు దూరమవుతున్నారు. ఫలితంగా సిబ్బంది ఈవీఎంలకు తప్పుడు కనెక్షన్లు ఇచ్చి, ఆడిస్తే ఆ మెషీన్లు ఎలా పనిచేస్తాయి? అది ఓటర్లలో, ప్రజల్లో అనుమానాలకు దారితీసింది’’.  శిక్షణ పూర్తి కాని వారిని, ఈవీఎంల నిర్వహణకు మెషీన్ల వద్ద ఎందుకు కూర్చోబెట్టవలసి వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం కమిషనర్‌ రావత్‌ నుంచి సమాధానం లేదు. పైగా ఈవీఎంలను ప్రతిదానికీ బలి పశువుల్ని చేస్తు న్నారని ఎదురు ప్రశ్నించారు. ‘2019 ఎన్నికలను ముందుకు నెట్టే ప్రతిపాదన కేంద్రం నుంచి ఏమైనా వచ్చిందా?’ అన్న ప్రశ్నకు కమిషనర్‌ జవాబివ్వలేదు. 

రెండు పార్టీల వ్యవస్థకే ‘మొగ్గు’ ?
రావత్‌ ఒక విషయాన్ని ఈ సందర్భంలోనే బయట పెట్టారు. దేశంలో వెయ్యి రాజకీయపక్షాలు నేడు రంగంలో పూర్తిగా లేకపోయినా, చాలా సంవత్సరా లుగా అలా ఉండిపోయాయి, వాటి జాబితా సిద్ధం చేసి, రద్దుపరచినట్లు ఆయన వెల్లడించారు. క్రమంగా మన దేశంలో కూడా అమెరికా (రిపబ్లికన్లు,  డెమొక్రాట్లు), బ్రిటన్‌ (కన్సర్వేటివ్, లేబర్‌ పార్టీ లు)లో మాదిరిగా మూడో రాజకీయ పక్షానికి తావు లేకుండా రెండే రెండు పార్టీలు ఏలికలుగా ఉండాలనే ఆలోచనలు చాలాకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ‘చురుకు’గా లేని రాజకీయ పార్టీల రద్దు చివరికి రెండు పార్టీలే ఒకదాని తర్వాత ఒకటి పాలక పక్షాలుగా మారే పరిస్థితికి దారితీస్తుంది. ‘సెక్యులరి జం–సోషలిజం’ పేరిట వాటిని విధిగా అనుసరించా లన్న రాజ్యాంగ శాసనాన్ని వల్లిస్తూనే ఆచరణలో అందుకు విరుద్ధంగా ఈ రెండు పార్టీల్లో ఒకటైన కాంగ్రెస్‌ ప్రవర్తిస్తోంది. కాగా, సకల జాతుల విభిన్న భాషా మైనారిటీల, భిన్న సంస్కృతులతో దీపిస్తున్న భారతావనిపై కేవలం మత రాజకీయ వ్యవస్థను బల వంతంగా రుద్దచూసి, సెక్యులర్‌ రాజ్యాంగాన్ని మొత్తంగా చాపచుట్టేయాలనే ఎజెండాతో కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీ సిద్ధమౌతోంది.

మధ్యప్రదేశ్‌లో భారీగా దొంగ ఓటర్లు!
ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రాలేదు. విజయావకాశాల కోసం ఇతర ‘మార్గాలు’ అనుసరించే క్రమంలో పట్టుబడిన ఘట్టం బీజేపీ పాలనలోని మధ్యప్రదేశ్‌లో  బయట పడింది. కొద్ది మాసాల్లోనే మధ్యప్రదేశ్‌లో సుమారు 60 లక్షలమంది దొంగ ఓటర్లు నమోదు కావడం, ఈ సంఖ్య ఆ రాష్ట్ర జనాభాకు, అక్కడి ఓటర్ల సంఖ్యకూ పొత్తూ పొంతనా లేకపోవడం ‘సంఖ్యా శాస్త్రం’లో నిష్ణాతులైన వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ రాష్ట్రంలో పదేళ్లలో జనాభా 20 శాతం పెరిగితే, అక్కడి ఓటర్ల సంఖ్య మాత్రం ‘జాంబవంతుడి’ అంగలతో 40 శాతానికి హనుమంతుడి తోక నిడివిని కూడా మించిపోయిందట. ఇది ఎన్నికల కమిషన్‌కి కూడా మింగుడుపడని ‘పచ్చివెలక్కాయ’గా మారిం ది. కమిషన్‌ రెండు బృందాలతో పరిశీలన కోసం నియమించిన కమిటీలు జూన్‌ 7 నాటికిగానీ నివేదిక ఇవ్వవు.

ఈ మొత్తం ప్రజా వ్యతిరేక పాలనా కథా వళిలో ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య ఒక చిత్రమైన అను బంధం కొనసాగుతూ వచ్చింది. ఒక్క కుబేర వర్గాల్ని తప్ప దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల్ని, చిన్న వ్యాపారులను పీల్చి పిప్పి చేసిన పెద్ద నోట్ల రద్దును మోదీ ప్రకటించారు. ఫలితంగా, కొన్ని సందర్భాల్లో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ‘నో–క్యాష్‌’ బోర్డుల మూలంగా రోజువారీ ‘రంగు’ తిరక్క పడి గాపులు పడుతూ కొందరు ప్రజలు ఆత్మహత్యలకు పాల్ప డ్డారు. ఇలాంటి ‘నోట్ల రద్దు’కు చంద్రబాబు మద్దతు పలికారు.

కేంద్ర క్యాబినెట్‌లోని టీడీపీ తైనాతీ మంత్రుల ద్వారా మోదీ స్కీము గురించి చంద్ర బాబుకు తెలిసిందని, మోదీ కన్నా వారంపది రోజుల ముందే ‘నోట్ల రద్దు’ను హైదరాబాద్‌లో ఆయన తన వారి చెవినవేసి తన వ్యాపారాలను ముందస్తుగా సర్దుకున్నారని ఆరోపణలొచ్చాయి.  ఒక వైపున నోట్ల రద్దువల్ల సామాన్య నగదు లావా దేవీలు సాగక క్యూలలో నిలబడి 125 మంది ప్రాణాలు కోల్పో యారు. అయితే  ఈ విషాదం మరచి, కనీసం వారి కుటుంబాలకు క్షమాపణ కూడా చెప్పకుండా తన పనికి 125 కోట్లమంది దేశ ప్రజలు హర్షిస్తున్నారని తనకు తాను కితాబులిచ్చుకున్నారు మోదీ.

జన వికాసానికి తోడ్పడని సంస్కరణలు
2018 చివరి మాసాల్లోగానీ, 2019 తొలి మాసాలలో గానీ ఇండియాలో లోక్‌సభకు మధ్యంతర లేదా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని  ప్రసిద్ధ ‘నొమూరా’ సంస్థ జోస్యం చెప్పింది. మోదీ ‘సంస్క రణలు’ ముందుకు సాగే పరిస్థితి లేదని నొమూరా అభిప్రాయపడుతోంది. ప్రస్తుత ‘సంస్కరణలు’ ప్రజా బాహుళ్యం విశాల ప్రయోజనాల వికాసానికి తోడ్పడేవి కావని నాలుగేళ్ల బీజేపీ పాలన రుజువు చేసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ ‘సంస్కరణలు’ దేశీయ ఉత్పత్తుల విలువలో ఏర్పడే ద్రవ్యలోటును భర్తీ చేసుకోగల స్థితిలో కూడా లేవని ‘నొమూరా’ విశ్లేషిస్తూ రానున్న పరిణామాల గురించి ఇలా పేర్కొన్నది:

‘‘దివాళాలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు అవ సరమైన పెట్టుబడులను ప్రభుత్వం భర్తీ చేయలేని పరిస్థితి. వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేక ప్రభుత్వ రుణం పెరిగిపోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ద్రవ్యలోటు భర్తీ చేయలేనంతగా తడిసి మోపె డుకానుంది. ఫలితంగా ‘సంస్కరణల’ పేరిట తల పెట్టిన తలకుమించిన అంచనాలు తలకిందులవు తాయి. నోట్ల ముమ్మరం (ఇన్‌ఫ్లేషన్‌) వల్ల ధరలు అదుపు తప్పిపోతాయి. తద్వారా ద్రవ్యపరమైన ఇబ్బందులు, నిరుద్యోగం పెరిగిపోతాయి. అటు ఉప ఎన్నికల ఫలితాలు, ఇటు క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు పార్లమెంటు ఎన్నికలను ముందుకు నెట్టవచ్చు.’’ ఈ జోస్యంతో ముందస్తు ఎన్నికల చర్చ ముందుకొ చ్చింది.

ఈ సందర్భంలో మనల్ని ‘అప్పుల పోల య్య’లుగా దిగజార్చిన ప్రపంచబ్యాంకుకు ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేసిన జోసెఫ్‌ స్టిగ్లిజ్, ఆ బ్యాంక్‌ పెట్టుబడులు వర్ధమాన దేశాలను సంక్షోభ స్థితికి తీసుకెళ్లాయని వివరించారు. ‘‘మితవాదులు, వామ పక్షాలు కూడా ఆర్థికాభివృద్ధే తమ ధ్యేయమని చెబు తారు. కానీ ఆచరణలో వామపక్షాలే దేశ ప్రగతికి, వికాసానికి సూచికలు. నిరంతర ప్రగతిని కాపాడుకో వడం క్లిష్టమైన కార్యమే కావచ్చు. కానీ మితవాదుల కన్నా వామపక్షీయులకే పొందికైన ఎజెండా ఉంది, అది ఆర్థిక వికాసాన్నే కాదు, సామాజిక న్యాయాన్ని కూడా చూపుతుంది’’అని స్టిగ్లిజ్‌ అభిప్రాయపడ్డారు. నిజమైన వృద్ధి కావాలనుకునే ప్రభుత్వాలు వామపక్ష విధానాలను ఆశ్రయించకతప్పదనేది ఆయన వాదన.


- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in


 

మరిన్ని వార్తలు