నకిలీ గురువులు

5 Jan, 2015 14:53 IST|Sakshi
నకిలీ గురువులు

మెహెర్ బాబా ఒక సందర్భంలో నకిలీ గురువులు, సాధువులు గురించి చెబుతూ ఇలా అన్నారు. మార్కెట్లో ఒక్కోసారి కొన్ని వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. గిరాకీకి తగ్గట్టుగా మార్కెట్లో సరుకు లభ్యం కాకపోతే నకిలీ వస్తువులు, నాసిరకం సరుకులు మార్కెట్లో ప్రవే శిస్తాయి. ఫలితంగా కొనుగోలుదారులకు నష్టాలు, రోగాలు. ఈ పరిస్థితి ఆధ్యాత్మిక రంగానికీ వర్తిస్తుంది. ప్రస్తుత కాలంలో భగవత్ భక్తి, ఆధ్యాత్మిక జిజ్ఞాస ప్రజ ల్లో ఎక్కువగా ఉంది. వారికి సరైన మార్గం చూపే సద్గు రువులు, సాధువులు తక్కువగా ఉన్నారు. ఫలితంగా నకిలీ గురువులు, దొంగ సాధువులు పుట్టుకొచ్చి ప్రజల ను మోసం చేస్తూ వారిని కష్టాలకు గురి చేస్తున్నారు.

 మంచి ముత్యానికి, కృత్రిమ ముత్యానికి మధ్య తేడా ఏమిటో మామూలు మనిషి కనిపెట్టలేడు. ముత్యా ల వర్తకుడికి మాత్రమే అది సాధ్యం. అలాగే సద్గురు వుకూ నకిలీ గురువుకూ మధ్య తేడా మామూలు మనిషి కనిపెట్టలేడు. సద్గురువో, నిజమైన సాధువో ఆ తేడా కని పెట్టగలడు. నకిలీ గురువులు, దొంగ సాధువులు వేదాంత గ్రంథాన్ని లోతుగా కా కుండా పైపైన చదివి మిడిమిడి జ్ఞానం సంపాదించి అలా త యారవుతారు. వేదాంత గ్రంథ పఠనం వల్ల ‘నేను భగవంతు డను, అహం బ్రహ్మాస్మి’ అనటం సులభం. అవతార పురుషుడు, సద్గురువు కూడా ‘నేను భగవంతుడను’ అనే చెబుతారు. అలా చెప్పటం వేదాంత గ్రంథాలు చదవటం వల్ల కా దు, బ్రహ్మ సాక్షాత్కారం పొందినందువల్ల, బ్రహ్మాను భవం కలిగినందువల్ల, బ్రహ్మమే తాము అయినందు వల్ల. ఇలాంటి కపట సన్యాసులు, సాధువులు, గురువులు తమకేగాక చుట్టూ ఉన్న సమాజానికి కూడా హాని చేస్తుంటారు. అలాగే నకిలీ గురువుల మాయలకు వారి శిష్యులు లొంగిపోయి వీరు చేసే చిన్న చిన్న మహత్యాల్ని గొప్పగా చేసి చూపిస్తూ, అతిగా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెడుతుంటారు.

 మహత్యాలన్నీ (మిరకిల్స్) మాయకు సంబంధిం చినవే. నకిలీ గురువులు చేసే మహత్యాలన్నీ మాయలో ఉన్న జనాన్ని ఇంకా మాయలోకి నెడతాయి. సద్గురువు మహత్యాలు చెయ్యడు, చేసినా, జనాన్ని మాయ నుండి బయటకు లాగటానికి మాత్రమే వాటిని చేస్తాడు.   సద్గురువులు ఎవరో, నకిలీ గురువులు ఎవరో కనిపెట్టడానికి మెహెర్‌బాబా కొన్ని కొండ గుర్తులు చెప్పినారు.
 నకిలీ గురువుల చుట్టూ హంగు, ఆర్భాటం ఎక్కువ గా ఉంటుంది. సద్గురువులు వీటికి దూరంగా, సాదా సీదాగా ఉంటారు.

 నకిలీ గురువుల చుట్టూ ఎంత ఎక్కు వ జనం పోగయితే వారికి అంత గొప్ప. సద్గురు వులు గుంపుకోసం వెంపర్లాడకుండా శిష్యులు, అనుయా యులు కొద్దిమందే అయినా వారిని చేయిపట్టి సన్మార్గం లో నడిపిస్తారు. నకిలీ గురువులు తమ పేరు ప్రతిష్ఠల కోసం, సుఖ సంతోషాల కోసం పాకులాడు తారు. సద్గురువులు ప్రాపంచిక సౌఖ్యాలకు, భోగ భాగ్యాలకు దూరంగాను, భగవంతునికి దగ్గరగాను ఉంటారు. నకిలీ గురువులు ఎప్పుడూ ఏదో ఆందోళనలో మునిగి ఉంటారు. సద్గురువుల చుట్టూ ఆనందం వెల్లివిరిస్తూ ఉంటుంది. సద్గురువులను ఆశ్రయించినవారు ఆ ఆనందంలో పాలుపంచుకుంటారు.
     - దీవి సుబ్బారావు
 
 

మరిన్ని వార్తలు