ఆన్‌లైన్‌ నియంత్రణ ఎలా?

27 Sep, 2019 01:26 IST|Sakshi

పట్టపగ్గాల్లేకుండా పోయిన సామాజిక మాధ్యమాలను నియంత్రించాలని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో మూడు వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమపై వివిధ హైకోర్టుల్లో ఉన్న కేసుల్ని సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యేలా ఆదేశాలివ్వాలని ఫేస్‌బుక్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా, సామాజిక మాధ్యమాల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించాలన్న నిబంధనలపై దాఖలైన పిటిషన్‌పైనా విచారిస్తున్న సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది. ఈ సంద ర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ గుప్తా చేసిన వ్యాఖ్యలు కూడా ఆలోచించదగ్గవి. సాంకేతిక పరిజ్ఞానం హద్దులు దాటి ప్రమాదకరంగా మారుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ చుట్టూ రోజూ చూస్తున్న, వింటున్న ఉదంతాల గురించి ఆలోచించినప్పుడు న్యాయమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో  ఏకీభవించనివారుండరు.

అయితే ఏ పరిజ్ఞానమైనా దానికదే ప్రమాదకర మైనది కాదు. దాన్ని ఉపయోగించే వ్యక్తుల మానసిక స్థితి, ప్రవర్తన తదితరాలు దాన్ని నిర్ణయి స్తాయి. సామాజిక మాధ్యమాలు రెండువైపులా పదునున్న కత్తిలాంటివి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని తాము ఎదుగుతూ, చుట్టూ ఉన్న సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లేవారు   న్నట్టే... అందులో లభ్యమయ్యే గోప్యతను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం చెలరేగుతూ సమస్యా త్మకంగా మారుతున్నవారూ ఉన్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్‌ వంటి మాధ్యమాలను నిత్యం ప్రపంచవ్యాప్తంగా వందలకోట్లమంది వీక్షిస్తున్నారు. తమ తమ అభి ప్రాయాలను పంచుకుంటున్నారు. ఒకరి మస్తిష్కంలో రగుల్కొనే ఒక ఆలోచన మరుక్షణం లక్షలాది మందికి దావానలంలా వ్యాపిస్తోంది. చర్చకు దారితీస్తోంది. ఈ మాధ్యమాలు సెల్‌ఫోన్లలో ఇమిడి పోవడంతో ఇదంతా సాధ్యమవుతోంది. 

ఈ సామాజిక మాధ్యమాల తీరుతెన్నులపై, వాటి పర్యవసానాలపై అంతక్రితం నుంచీ సాగు తున్న చర్చ ఈ ఏడాది మార్చి నెలలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌ చర్చి నగరంలో ఒక ఉన్మాది మసీ దుల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు సాగించి 51మందిని పొట్టనబెట్టుకున్న అనంతరం మరింత తీవ్రంగా సాగుతోంది. నాలుగు నెలలక్రితం పారిస్‌లో ప్రపంచ దేశాల అధినేతలూ, సామాజిక మాధ్యమాల అధిపతులూ ఈ ఘటనపైనే శిఖరాగ్ర సదస్సు జరిపారు. ఆన్‌లైన్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపైనే వీరు దృష్టి కేంద్రీకరించారు. విద్వేషపూరిత భావాల వ్యాప్తిని సామాజిక మాధ్యమాల్లో సాగనీయబోమని మన దేశంతోసహా 17 దేశాలూ... 8 సామాజిక మాధ్యమాలు ప్రకటించాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. వ్యక్తులుగా అనేకులు సామాజి మాధ్య మాల వల్ల లాభపడుతున్నట్టే, వాటివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారు, వాటి కారణంగా మాన సిక ప్రశాంతత కరువైనవారు ఉన్నారు. ఎవరో, ఏమిటో అవతలివారికి తెలిసే అవకాశం లేదు కనుక ఇష్టానుసారం వ్యాఖ్యానించి, దూషించి ఇబ్బందులకు గురిచేస్తున్న నేరగాళ్లకు సామాజిక మాధ్యమాల్లో కొదువలేదు. ముఖ్యంగా మహిళలు ఇందువల్ల తీవ్ర సమస్యలెదుర్కొంటున్నారు.

రెండేళ్లక్రితం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, దేశ రక్షణ విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారి కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌ ఒక ట్వీట్‌లో తన తండ్రిని చంపింది పాకిస్తాన్‌ కాదని... యుద్ధమని చెప్పినందుకు ఆమెపై దుండగులు ఎలా చెలరేగిపోయారో ఎవరూ మరిచిపోరు. ఆమె మనస్సును ఎవరో కలుషితం చేశారన్నవారి దగ్గర నుంచి ఆమెపై అత్యాచారం చేస్తామని, అత్యంత పాశవికంగా హతమారుస్తామని బెదిరించినవారి వరకూ ఎందరో ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పశు మాంసం దగ్గరుంచుకున్నారని, ఆవుల్ని కబేళాలకు తరలిస్తున్నారని, పిల్లల్ని అపహరించే ప్రయత్నం చేశారని రకరకాల ముద్రలేసి వ్యక్తుల్ని కొట్టి చంపిన ఘటనలు అనేకం. సామాజిక మాధ్యమాల్లో దుండగులు వదంతులు వ్యాప్తి చేసి ఈ మూకదాడులకు పాల్పడుతు న్నారు. ఇది మన దేశానికి మాత్రమే పరిమితమైన దుర్లక్షణం కాదు. అన్ని దేశాలకూ ఈ రోగం వ్యాపించింది. సామాజిక మాధ్యమాలకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. కనుకనే కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఫేస్‌బుక్‌పై అటువంటి కేసులే ఉన్నాయి. ఈ మాధ్య మాల ద్వారా వేలకోట్లు ఆర్జిస్తున్న సంస్థలు తగిన స్థాయిలో మానవ వనరులను వినియోగిం చుకుంటే వీటిని అరికట్టడం పెద్ద కష్టం కాదు. తరచు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నవారిని గుర్తించి అడ్డుకోవడం సమస్య కాదు. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే సరిపోతుందని సామాజిక మాధ్యమాలు భావిస్తున్నాయి.ఆచరణలో ఫలితాలెలా ఉంటున్నాయో తెలుస్తూనే ఉంది.
 
అయితే మాధ్యమాల నియంత్రణను పూర్తిగా ప్రభుత్వాలకు వదిలేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. చట్టంలో అస్పష్టతకు తావులేకుండా, నేర నిర్వచనం స్పష్టంగా ఉంటే వేరుగానీ, లేనట్టయితే ఆ వంకన ఎవరినైనా నిర్బంధించడానికి ప్రభుత్వాలు సిద్ధపడతాయి. తమను ప్రశ్నించినవారిని, తమ నిర్ణయాలను విమర్శించినవారిని ప్రభుత్వాలు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద నిర్బంధించిన ఉదంతాలు చూశాక ఆ సెక్షన్‌ రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు 2015లో తీర్పునిచ్చింది. వాస్తవానికి ఇప్పుడున్న చట్టాలను సరిగా వినియోగిస్తే ఆన్‌లైన్‌ దుండ గుల్ని అదుపు చేయడం కష్టం కాదు. భారతీయ శిక్షాస్మృతిలోని పలు నిబంధనలు ఆన్‌లైన్‌లో మహి ళలను వేధించేవారిని, అసభ్యకరమైన సందేశాలను, చిత్రాలను పంపేవారిని, ఆన్‌లైన్‌లో వెంటబడే వారిని శిక్షించడానికి వీలు కల్పిస్తున్నాయి. వాటన్నిటినీ క్రోడీకరించి సమగ్రమైన చట్టం రూపొందిం చడమే ఉత్తమం.

మరిన్ని వార్తలు